ఎందుకు ?
‘బ్రాహ్మణుడు’ అంటే ఎవరు?
‘బ్రహ్మ జ్ఞానవాంస్తు బ్రాహ్మణః’ అని బ్రాహ్మణునికి నిర్వచనం చెప్పారు సనాతనులైన పూర్వీకులు.
ఆ|| పాపవర్తనుండు బ్రాహ్మణుండయ్యును
నిజముశూద్రుకంటె నీచతముడు
సత్య శౌచధర్మశాలి శూద్రుండయ్యు
నతడు సద్ద్విజుండ యనిరి మునులు
– ‘శ్రీమహాభారతం’
సీ|| ఎవ్వడు సత్యంబు నెప్పుడు బల్కు, హింసావిదూరుడు గురుజనహితార్థి
యింద్రియంబులనోర్చి ఎల్లవారల దనయట్ల జూచు ధర్మాభిరతుడు
కామంబు తగులండు కర్మంబులారును, సముచిత సంప్రయోజతనొనర్చు
అట్టి పుణ్యాత్ముని అనఘబ్రాహ్మణుడని యనిశంబు గీర్తింతురమరవర్యు.
ఆ|| లార్జవంబు శమము నధ్యయవంబును
పరమధనముసువ్వె బ్రాహ్మణునకు
ధర్మగతికి ననియు తగు సాధనంబులు
వేదవిహితముఖ్యవిధులు నెనయె
– శ్రీమహాభారతం – అరణ్యపర్వం
శ్లో|| జన్మవా బ్రాహ్మణోజ్ఞేయః, సంస్కారైః ద్విజ ఉచ్యతే!
విద్వత్వాచ్చాపి విప్రత్వం త్రిభిశ్శోత్రియ ఉచ్యతే|| – ‘ధర్మశాస్త్రం’
“చాతుర్వర్ణం మయాసృష్టం గుణభేద విభాగశః”
– భగవద్గీత
శూద్రునకు జన్మించినవారు శూద్రుడు కాగలడుగాని బ్రాహ్మణునికి జన్మించినంత మాత్రాన బ్రాహ్మణుడు కాలేడు అంటున్నది ధర్మశాస్త్రం. వేదమూ, పురాణాలు, శ్రుతులు, స్మృతులు కూడా ఇదేమాట చెబుతున్నాయి. బ్రాహ్మణుని “ద్విజుడు” అని కూడా అంటారు. ద్విజుడు అంటే రెండు సారులు జన్మించినవాడు అని అర్థం. మొదటి జన్మ తల్లి గర్భం నుండి జరిగింది. రెండవ జన్మ సంస్కారం వల్ల జరుగుతుంది. జన్మవల్ల శూద్రత్వం లభిస్తే కర్మవల్ల బ్రాహ్మణత్వం లభిస్తుంది.
బ్రాహ్మణుడుగా పుట్టడం గొప్పకాదు. బ్రాహ్మణుడుగా జీవించటం గొప్ప!
సర్వశాస్త్రాలు, సమస్త హైందవ ధర్మమూ ఈవిషయాన్ని నొక్కిచెప్పాయి.
సమస్త బ్రాహ్మణకులానికి గాయత్రీ మంత్రాన్ని రచించి చెప్పిన శ్రీ విశ్వామిత్ర మహర్షి బ్రాహ్మణ కులంలో జన్మించలేదు. సనాతన బ్రాహ్మణ కులమంతా నమస్కరించి శ్రీరాముడు బ్రాహ్మణ కులంలో జన్మించిన వాడు కాదు! శ్రీకృష్ణుడు కూడా బ్రాహ్మణ కులస్థుడు కాదు. మత్స్య – కూర్మ – వరాహ – నారసింహాది అవతారాలేవి బ్రాహ్మణత్వం కాదు.
వేదాలలో ఎక్కడా కులప్రసక్తి లేదు.
జనహితం జనసుఖం బ్రాహ్మణుని లక్ష్యం.
బ్రాహ్మణుడు సౌందర్యాభిలాషి కాకూడదు. ఎక్కువసార్లు అద్దంలో ప్రతిబింబాన్ని చూచుకోకూడదు. ప్రతినిత్యం క్షురకర్మ చేయించుకొనకూడదు. బహుభార్యాత్వాన్ని కలిగి వుండరాదు. సుఖాభిలాష వుండకూడదు. పాదరక్షలు ధరించకూడదు. మద్యపానం సేవించకూడదు. మాంసాహారం ముట్టకూడదు. విదేశప్రయాణం చేయకూడదు. ఇతర ఆహారపదార్ధాలు భుజించకూడదు. ఇతర సంస్కృతిని అన్యదేశ వస్తువులను ముట్టకూడదు. అశ్లీల శబ్దాలను ఉపయోగించకూడదు. ఏ పరిస్థితిలోనూ కోపాన్ని ఆశ్రయించకూడదు. అబద్ధం చెప్పకూడదు. ధనాన్ని, సుఖాలనూ అభిలషించకూడదు. స్త్రీలవంక నిశితంగా చూడకూడదు. ఆహారాలనూ, వస్తువులనూ, కాఫీ వంటి విదేశ పానీయాలను ముట్టకూడదు. తాను అభ్యసించిన వేదవిద్యను ధనాశకు వినియోగించకూడదు. ప్రాణులను కర్రతోగాని, రాయితోగాని కొట్టకూడదు. ఏ విధమైన వ్యాపారాలు చేయకూడదు. గోష్పాదం (పిలక) లేకుండా వుండకూడదు. సినిమా నాటకాలు మున్నగునవి చూడకూడదు. ఏకపత్నీవ్రతాన్ని తప్పక పాటించాలి. సర్వజన శాంతి సుఖాల కోసం దేవుని ప్రార్థించాలి. దైవ ప్రార్ధనలో తన స్వార్ధం విడచి జనహితాన్ని కోరుకోవాలి. జనహితంకోసమే తన జీవితాన్ని ఖర్చు చేయాలి. మనస్సు, మాట, శరీరం, పని లోకహితార్ధమై వుండాలి. నేలమీదనే నిద్రించాలి. కోరికలను త్యజించాలి – బ్రాహ్మణునికి ఇన్ని నియమ నిబంధనలు వున్నాయి. ఈ నియమాలను పాటించిన ధర్మమూర్తినే బ్రాహ్మణుడు అని భావించి గౌరవించి నమస్కరించాలి.
ధార్మిక లక్షణాలున్నవారెవరైనా బ్రాహ్మణులే!
‘బ్రాహ్మణ్యం’ కులసంకేతపదం కాదు. గుణసంకేత పదం.
‘బ్రాహ్మణాయ నమోనమః’
బ్రహ్మజ్ఞానాయ నమోనమః
---------------------------------------------
శుభలేఖలకి నలువైపులా పసుపును ఎందుకు రాస్తారు? ఇది దేనికి సూచిక?
మహలక్ష్మిదేవికి, ఆమె అక్క జ్యేష్టదేవికి ఎవరెక్కడ ఉండాలన్న విషయమై చర్చ వచ్చింది. లక్ష్మీదేవి సముద్రంలోకి వెళ్లి దాక్కోవటంతో ఆమెని బయటికి రమ్మని జ్యేష్టాదేవి కోరింది. ఆ సమస్య కొలిక్కి వచ్చిన సమయంలో లక్ష్మీదేవి తానేక్క డ ఉంటుందో చెప్పింది. వాటిలో పసుపు ఒకటి. అందువల్లనే వివాహ శుభలేఖలకి , కొత్త వ్యాపార పుస్తకాలకు పసుపు రాసి శ్రిమహలక్ష్మికి ఆహ్వానం పలుకుతారు. ఆమెను ఆవిధంగా స్మరించుకోవడం వల్ల ఆమె కృప అన్నివేళలా వారిపై ఉంటుందని పురాణాలూ తెలియజేస్తున్నాయి. చెల్లెలి మాటపై జ్యేష్టాదేవి ఆ పరిసరాల్లోకి రాదు.
---------------------------------------------
తాంబూలం ఎందుకు?
ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.
ఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం... అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు.
హిందూ సంస్కృతిలో తాంబూలానికి - అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఆయర్వేద శాస్త్రం తమలపాకు సేవనం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంది.
అందరు దేవుళ్లకి తమలపాకులతో పూజలు చేయటం ఉన్నప్పటికి. ఆంజనేయస్వామికి ఆకు పూజ అత్యంత ప్రీతికరమైనది అని చెప్తున్నాయి ధార్మిక గ్రంధాలు. శత పత్ర పూజ చేస్తే వివిధ దోషాలకు పరిహారం చెల్లించినట్టే అని పండితులు చెప్తున్నారు.
వివిధ నోములు, వ్రతాలు, శుభ కార్యాలు జరిగినప్పుడు అరటిపళ్ళు. వస్త్రంతో పాటు రెండు తమలపాకులను చేర్చి ఇవ్వడం తెలిసిందే. ఇలా తమలపాకులను ఇవ్వడం వల్ల సర్వవిధాలా శుభం చేకూరుతుంది.
ఆధ్యాత్మిక సంబంధమైన విషయాలను పక్కన పెడితే, శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసే కాల్షియం, ఫోలిక్ యాసిడ్, ఎ విటమిన్. సి.విటమిన్ లు తమలపాకులో పుష్కలంగా వున్నాయి. తాంబూలం రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
ఫైబర్ - అంటే పీచు పదార్ధం తమలపాకులో చాలా ఎక్కువగా వుంటుంది. ఆకుకూరలు ఏవిధంగా అయితే జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయో తమలపాకులు కూడా అలాగే, అంతకంటే ఎక్కువగా పని చేస్తాయి. సున్నం, వాక్క తదితర కృత్రిమ పదార్థాలను చేరిస్తే మాత్రం తమలపాకు శరీరానికి హానికరంగా మారుతుందని గ్రహించాలి.
---------------------------------------------
గురువారానికి వుండే విశిష్టత ఏమిటి?
సద్గురు సాయినాథుల వారికి పూర్వము గురువారానికి అధిష్టాన దైవము ఎవరు ?
ప్రత్యేకముగా సాయినాథులవారు గురువారమును ఎంచుకోవటంలో అంతరార్థము ఏమిటి ?
వార అధిష్టాన దేవతల గురించి శ్రీ మన్మహాదేవుల వారు ఈ క్రింది విధంగా చెప్పటం జరిగింది.
ఆదివారమునకు శ్రీ మన్మహాదేవులవారు అధిష్టానము. ఈ రోజున ప్రణవార్చన చాలా విశేషము. అంటే ఓంకార సంపుటీకరణతో చేసే అర్చన, అభిషేక, ఆరాధనలు విశేష ఫలితాన్ని ఇస్తాయి. సోమవారమునకు శివుని మాయ, మంగళవారమునకు స్కంద, బుధవారమునకు విష్ణు, గురువారమునకు బ్రహ్మ మరియు విఘ్నేశ్వర, శుక్రవారమునకు ఇంద్ర, శనివారమునకు యమధర్మరాజు అధిష్టాన దేవతలు. నవగ్రహములు ఆవిర్భవించిన తర్వాత ఆయా గ్రహములకు ఆధిపత్యము ఇవ్వటము జరిగింది.
సద్గురువుల ఆవిర్భావము అయ్యాక గురువారము శ్రీ సాయినాథ, అదే విధంగా వెంకటేశ్వర ఆవిర్భావం అయ్యాక శనివారము శ్రీ వెంకటేశ్వర అర్చన, ఆరాధనలు చేస్తున్నాము. ఏ నూతన కార్యం ప్రారంభించటానికి అయినా, గురువారము చాలా మంచిది. ఆ రోజు ప్రారంభం చేసిన కార్యం దిగ్విజయాన్ని చేకూరుస్తుంది. ఆ వారఫలము చేత కేవలము సాయినాథుల వారి అనుగ్రహమే కాకుండా, శ్రీ సరస్వతి సమేత బ్రహ్మదేవ, శ్రీ సిద్ది బుద్ది సమేత గణనాథుల వారి అనుగ్రహము కూడా కలుగుతుంది.
అన్ని వారాలలో సాయినాథులవారికి గురువారము ప్రత్యేకము. అంటే, కలియుగంలో ఎవరైతే సద్గురువులను ఆశ్రయించి, వారి అనుజ్ఞ తీసుకొని నూతన కార్యాన్ని ప్రారంభిస్తూ ఉంటారో, వారికందరికీ బ్రహ్మదేవులవారి అనుగ్రహంతో మంచి బుద్ది, బ్రహ్మశక్తి అయిన సరస్వతి అనుగ్రహంతో మంచి ప్రవర్తన, గణనాథులవారి అనుగ్రహంతో మంచి వ్యక్తులతో స్నేహము అనే ఫలితములు కలుగుతాయి. తద్వారా ప్రారంభించిన కార్యాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
శ్రీ సద్గురు సాయినాథులవారు గురువారాన్ని ప్రత్యేకంగా ఎంచుకోవటానికి అనేక విషయాలు కారణములుగా వుంటాయి. వాటిలో పైన చెప్పినది కూడా ఒక కారణము. సద్గురువుల అనుగ్రహము వలన కలిపురుషుని ప్రభావము అధికంగా వుండే ఈ కలియుగంలో కూడా మన్యుష్యులందరికీ మంచి బుద్ది, మంచి ప్రవర్తన, మంచి వ్యక్తులతో స్నేహము అనే మూడు ముఖ్యమైన మంచి గుణములు చేకూరు గాక ! అదే విధంగా ఈ లోకంలో వుండే గురువులందరూ, సద్గురువుల లాగా భక్తులందరికీ శుభ ఫలితములు చేకూర్చెదరు గాక !
-------------------------------------------------------
తిధుల ప్రాధాన్యత ఏమిటి?
ఏ తిధి రోజున ఏ దేవతను పూజ చేయాలి?
తిధి వ్రతములు చేయటం వలన లభించే ఫలితాలు ఏమిటి?
ఒకొక్క తిధికీ ఒక్కో దేవత అధిపతిగా వుండటం జరుగుతుంది. అదే విధంగా, పాడ్యమ్యాది తిధుల యందు వాటికి సంబంధించిన వ్రతాన్ని పన్నెండు మాసముల పాటు ఆచరిస్తే సత్ఫలితములు లభిస్తాయి. తిథి అధిపతి మరియు వ్రత ఫలము గురుంచి క్లుప్తముగా క్రింద చెప్పబడినది.
పాడ్యమి : అధిదేవత - అగ్ని. వ్రత ఫలం - సత్ఫల ప్రాప్తి.
విదియ : అధిదేవత - అశ్విని దేవతలు. వ్రత ఫలం - ఆరోగ్య వృద్ది.
తదియ : అధిదేవత - గౌరీ దేవి. వ్రత ఫలం - సుమంగళీ అనుగ్రహం.
చవితి: అధిదేవత - వినాయకుడు. వ్రత ఫలం - కష్టములు తొలగిపోవుట.
పంచమి: అధిదేవత - నాగ దేవత. వ్రత ఫలం - వివాహము, వంశ వృద్ది.
షష్టి : అధిదేవత - సుబ్రహ్మణ్య స్వామి. వ్రత ఫలం - పుత్ర ప్రాప్తి.
సప్తమి: అధిదేవత - సూర్య భగవానుడు. వ్రత ఫలం - ఆయురారోగ్య వృద్ది.
అష్టమి: అధిదేవత - అష్టమాత్రుకలు. వ్రత ఫలం - దుర్గతి నాశనము.
నవమి: అధిదేవత - దుర్గాదేవి. వ్రత ఫలం - సంపద ప్రాప్తిస్తుంది.
దశమి: అధిదేవత - ఇంద్రాది దశ దిక్పాలకులు. వ్రత ఫలం - పాపాలు నశిస్తాయి.
ఏకాదశి: అధిదేవత - కుబేరుడు. వ్రత ఫలం - ఐశ్వర్యము ప్రాప్తించును.
ద్వాదశి: అధిదేవత - విష్ణువు. వ్రత ఫలం - పుణ్య ఫల ప్రాప్తించును.
త్రయోదశి: అధిదేవత - ధర్ముడు. వ్రత ఫలం - మనస్సులో అనుకున్న కార్యం ఫలిస్తుంది.
చతుర్దశి: అధిదేవత - రుద్ర. వ్రత ఫలం - మ్రుత్యున్జయము, శుభప్రదం.
అమావాస్య: అధిదేవతలు - పితృదేవతలు. వ్రత ఫలం - సంతాన సౌఖ్యం.
పౌర్ణమి: అధిదేవత - చంద్రుడు. వ్రత ఫలం - ధనధాన్య, ఆయురారోగ్య, భోగభాగ్య ప్రాప్తి.
------------------------------------------
వివాహంలో దంపతుల చేత ఏడు అడుగులు ఎందుకు వేయిస్తారు...?
వివాహ సమయంలో దంపతుల చేత ఏడు అడుగులు వేయిస్తారు. హోమం చుట్టూ వేసే ఆ ఏడు అడుగులనే సప్తపది అంటారు. సప్తపదిలో వేసే ప్రతి అడుగుకు ఒక అర్థముంది.
తొలి అడుగు తమ జీవితాలకు అవసరమైన ఆర్థిక శక్తి సాధనకు, రెండవ అడుగు ఆరోగ్యకర ఆధ్యాత్మిక చింతనకు, మూడవ అడుగు ధర్మబద్ధ ఆర్థిక సంపాదన కొరకు, నాల్గవ అడుగు విజ్ఞాన సముపార్జనకు, ఆనంద, ప్రేమ, గౌరవాలకు, ఐదవ అడుగు సంతానం పొంది వారి బాధ్యత తీసుకుంటామని, ఆరవ అడుగు తమ చర్యలపై నియంత్రణ సాధనకు, ఏడవ అడుగు ఒకరికోసం మరొకరిగా కలకాలం బతుకుతామనే వేయిస్తారు.
మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.
------------------------------------------
ఎవరు ఎవరికి గురువులు.. ఎవరు ఎవరికి ఏం చెప్పారు?
ఈ సృష్టికి మూల విరాట్టుగా భావించే బ్రహ్మ తన కుమారుడైన నారదునికి శ్రీమద్రామాయణ కథ మొత్తాన్ని చెప్పాడు. కొడుకు అయిన కపిలుడు తన తల్లి అయిన దేవహుతికి సాంఖ్య యోగాన్ని వివరించాడు. భర్త అయిన శంకరుడు తన భార్య అయిన పార్వతీదేవికి వేదాంత రహస్యం చెప్పాడు.
బావ అయిన శ్రీకృష్ణ పరమాత్ముడు తన బావమరిది అయిన అర్జునునికి గీత సారాంశం మొత్తం చెప్పాడు. మరణానికి భయపడని శుకుడు మరణభయంతో ఉన్నటువంటి పరీక్షిత్తునికి ఆధ్యాత్మ విద్యను వివరించాడు.
అలాగే, జగద్గురువైన నారాయణుడు తన శిష్యులైన సన్యాసులందరికీ మోక్షవిద్యను చెప్పాడు. తనకొక్కనికే చెప్పిన మంత్రాన్ని రామానుజుల వారు.. వినబడేంత దూరంలో ఉన్న ప్రతి ఒక్కరికీ వినిపించేలా ఆ మంత్రాన్ని చెప్పాడు. ఇక్కడ వీరు.. వారు అనే తేడాలేకుండా తమకు తెలిసిన విద్యను శిష్యులుగా భావించిన వారికి తెలియజెప్పారు.
------------------------------------------
శివునికి మాత్రమే అభిషేకం చేస్తారు...మిగతా దేవుళ్ళకు చేయరు ఎందుకని?
అభిషేకమంటే శివునికి అమావాస్య పూర్వకంగా నమక, చమక, పురుషసూక్త మంత్రాలతో చేసేది. శివుడు అభిషేక ప్రియుడు. ఆయనకు ఏకాదశ (పదకొండు సార్లు నమకం చెబుతూ) రుద్రాభిషేకం చేస్తారు. పదకొండుసార్లు కుదరకపోతే ఏకవారం చేయవచ్చు.
శివునికి చేసేదే అభిషేకం. మిగిలిన దేవీదేవతలకు మంత్రపూతంగా స్నానం చేయించడం జరుగుతుంది. ఆయా దేవతలకు చేసే పదహారు రకాల ఉపచారాలలో స్నానం కూడా ఒకటి.
------------------------------------------
హనుమంతునికి ఇష్టమైన పువ్వులేంటో తెలుసా?
జానకీ శోక నాశనుడు ఆంజనేయుడు. ఆయనకు మొల్ల, పొన్నపువ్వు, మొగలి, పొగడ, నందివర్ధనము, మందారము, కడిమి, గజనిమ్మ, పద్మము, నల్లకలువ, ఎర్ర గన్నేరు, సన్నజాజి, మల్లె, గులాబి, మోదుగ, సంపంగి, కనకాంబర, ములుగోరిట, మెట్ట తామర, పొద్దు తిరుగుడు పువ్వులంటే చాలా ఇష్టం
అలాగే మంకెన, బండికెరి వెంద, అడవిమల్లె, కొండగోగు దింటెన, జిల్లేడు, సురపున్నాగ, కుంకుమ పువ్వు, మద్ది, సువర్ణ పుష్పం, గౌరీ మనోహరం వంటి పుష్పాలతో పూజించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం.
ఇంకా పసుపు, అక్షింతలు, తిరుమారేడు, నేరేడు, రుధ్ర జడ, తులసి, మాచిపత్రి, ఎర్రకలువ, గోరింట, ఉత్తరేణి, తమలపాకులంటే ఆంజనేయ స్వామికి ఇష్టమని పండితులు అంటున్నారు. ఈ పుష్పాలతో స్వామిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయని వారు చెబుతున్నారు.
------------------------------------------
ఆంజనేయునికి తమలపాకులంటే ఇష్టం.. ఎందుకని?
ఆంజనేయుడు నాగవల్లి ప్రియుడు. నాగవల్లి అనగా పాము పడగ వంటి ఆకారము కలిగిన దళములు - తమలపాకులు. ఇవి ఆయనకు ఎందుకిష్టమంటే దేవదానవులు క్షీరసాగర మధనం చేసిన సమయంలో కల్పవృక్షం, కామధేనువు, చింతామణి, లక్ష్మీదేవి, కుశలు, కాలకూట విషము, అమృతము ఆపై నాగవల్లి పత్రములు గూడ ఉధ్భవించినవట.
ఆ ఆకులు సేవించటం ఆరోగ్య భాగ్యానికి హేతువు. తమలములు తమ జన్మలో ఒక్కసారైనా నమలని జన్మ బహుశావుండదని వేమనశతకంలో వివరించెను. జీర్ణశక్తి, ఎముకలపుష్టి, వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట, పైత్యం, అరుచి మొదలైన ఔషధాలన్నీ తమలపాకుల్లో ఉన్నాయి.
అందువలన తమలపాకులతో ఆంజేయునికి దళార్చన చేయాలనుకునే వారు మూలం క్రింద వుండే విధంగా దళపై భాగం ముందునట్లుంచి పూజించవలెను. భక్తులు భగవంతునకు పత్రం, పుష్పం, ఫలం, ఉదకమైనా భక్తితో సమర్పించుట మంచిది.
ఆంజనేయుని దేహము ఆకుపచ్చారంగులో నుండును - సుందరకాండలో వనములు తిరుగుచూ లంకాపురం చరించునప్పుడు అది రక్షణ కవచంగా కాపాడెను. కాబట్టి తమలపాకులతో స్వామిని అర్చిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఇంకా శ్రీరామజయం అని రాసి తమలపాకులతో గానీ పేపర్లలో గానీ మాలగా సమర్పిస్తే వారు చెబుతున్నారు.
------------------------------------------
అర్జునుడు అఖండమైన సవ్యసాచి ఎలా పేరుగాంచాడు?
మహాభారతంలోని పంచపాండవుల్లో అర్జునుడు ఒకరు. ఈయన ఘనమైన విలుకాడుగా ఎలా రూపొందడానికి ప్రధాన కారణంగా ఆయనలో ద్విగుణీకృతమైన పట్టుదల. మొక్కవోని దీక్షలే. తనకు కాంతి తక్కువ ఉన్నప్పుడు విలువిద్య కష్టంగా ఉందని పలికిన అర్జునుడితో ద్రోణుడు "అర్జునా.. నీవు ఈ జగతిలో స్థిరంగా నిలిచిపోయే విలుకాడు కావాలని ఆకాంక్షిస్తున్నావు.
దీనికి కావలసింది పట్టుదల నిండిన హృదయం, అంకితభావం. కఠోరంగా పరిశ్రమిస్తే శబ్దాన్ని బట్టి ఆ వస్తువును ఛేదించే శబ్దవేది విద్యలోనూ నీవు గొప్ప విలుకాడు కాగలవు. అతి సున్నితమైన వస్తువులను సైతం ఛేదించాలంటే నీవు అతి తక్కువ కాంతితో సాధన చేస్తేనే పరిపూర్ణుడివి అవుతావు అని అనగానే అర్జునునికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అప్పటి నుంచి నిరంతరం పరిశ్రమించి తన విద్యలో అఖండమైన ప్రజ్ఞను సాధించి జగతిలోనే 'సవ్యసాచి'గా పేరుగాంచాడు.
------------------------------------------
శరీరంపై వ్యామోహం.. అజ్ఞానమే మోహానికి కారణమా?
ఈ జగత్తంతా పంచభూతాలలో ఏర్పడింది. పంచభూతాలుగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము. ఈ ఐదింటి చేతనే విశ్వమంతా నిర్మింపబడింది. కుమ్మరివాసి వద్ద కుండలు, ముంతలు, చట్లు, బానలు మొదలైనవి ఉన్నప్పటికీ అవన్నీ మట్టి రూపాంతరాలే అవుతాయి.
అట్లే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోట్ల యొక్క భౌతిక స్వరూపాలను పంచభూతాలతోనే నిర్మించియున్నాడు. కనుకనే ప్రపంచంలోని ఏ వస్తువును విడదీసినా పంచభూతాలే కనబడతాయి. ప్రతి వస్తువు, ప్రతి శరీరము పృథివి జలాదులను పంచభూతాలతోనే ఏర్పడుటను బట్టి వాటిలో ఆసక్తిని రేకెత్తించే విషయము ఏమున్నది ఈ సత్యం తెలిస్తే ఇక మానవుడు విషయ భోగాల పైకి పరిగెత్తడు.
దృష్టాంతానికి మానవ శరీరం పెక్కు అందచందాలతో కూడియున్నప్పటికీ అది మట్టి, నిప్పు, నీళ్ళు మున్నగువానితో ఏర్పడింది కాబట్టి ఇక అట్టి శరీరంపై వ్యామోహం ఎందుకు కలుగుతుంది. అజ్ఞానమే మోహానికి కారణం.
జ్ఞానం కలవాడికి ఈ ప్రపంచమంతా పంచభూతాత్మకంగానే కనిపిస్తుంది. కనుకనే అతనికి విషయాదులపై ఆసక్తి యుండదు. సత్యాన్ని గుర్తించబడటం బట్టి దృశ్య విషయాలపైకి అతడు పరుగిడడు.
ప్రపంచంలో ఎక్కడ వెతికినా, ఏలోకానికి వెళ్ళినా నిప్పు, నీళ్ళు, మట్టి, గాలి, ఆకాశం తప్ప ఆరవ వస్తువు ఏదీ లేదు. జగత్తులో ఎక్కడ చూచినా, వెతికినా పంచభూతాలు తప్ప ఆరవ మహాభూతంలేదు.
కనుకనే జ్ఞాని విషయాసక్తరహితుడై దృశ్యభోగాలవైపు పరుగిడక. దృష్టిని ఆత్మవైపుకు మరల్చి అదియే సారభూతమైందని గ్రహించి దాన్నే సేవిస్తూంటాడు. ధ్యానిస్తూంటాడు.
కాబట్టి జిజ్ఞాసులు, జన్మను తరింపజేసుకొనువారు పంచభూతమయము లందు విరక్తి కలిగి, ఆత్మ యందు అనురక్తి కలిగి, స్వస్వరూప సాక్షాత్కరానికి తీవ్రతర కృషి సలపాలి.
------------------------------------------
హాయిగా.. ఆనందంగా గడిపేందుకు మార్గమేంటి?
ఈ లోకంలో చాలా మంది చాలా రకాలైన సమస్యలతో సతమతమవుతుంటారు. ఇలాంటి వారు తమ జీవితాన్ని హాయిగా, ఆనందమయంగా గడిపే మార్గాల కోసం అన్వేషిస్తుంటారు. ఇలాంటి వారు విధిగా కొన్ని ప్రమాణాలను పాటించినట్టయితే ఖచ్చితంగా వారి జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుందని పలువురు ఆధ్యాత్మిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం వారు చేయాల్సిందల్లా తాము ఎంచుకున్న ప్రమాణాలను క్రమం తప్పకుండా అనుసరించడమే.
ఇందుకోసం ఈ రోజు కోపం తెచ్చుకోను. ఆందోళన చెందను. కృతజ్ఞతాభావంతో మెలుగుతాను. అందరిపట్ల సానుభూతితో వ్యవహరిస్తాను. పనిని మనస్ఫూర్తిగా.. ఉల్లాసంగా పూర్తి చేస్తాను. పూర్తిగా సంతోషంతో, ప్రశాంతతో ఉంటాను అని తమకు తామే చెప్పుకోవాలి.
అయితే, ప్రతి రోజూ ఉదయం లేవగానే ఊరికే అనుకుని వదిలి వేయకూడదు. మనఃపూర్వకంగా అచరించే ప్రయత్నాలు సాగించాలి. దైనందిన కార్యకలాపాల్లో ఒత్తిళ్లు, ఆనందోళనలు ఉండటమన్నది సహజం. వాటిని అంతటితో వదిలేయాలని సలహా ఇస్తున్నారు. తమకు ఎదురయ్యే కష్టనష్టాలను తలచుకుంటూ కుంగిపోవడం కంటే.. వాటిని వదిలి వేసి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
------------------------------------------
ప్రార్ధనా గదిని ఎందుకు కలిగి ఉండాలి?
భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు. ప్రతి రోజూ దైవానికి ముందు ఒక దీపాన్ని వెలిగిస్తారు. జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనాలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు. పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.
పూజాగది - ఎందుకు?
ఈ చరాచర సృష్టికి పరమాత్మ మాత్రమే సొంత దారుడు. కావున మనము నివసించే గృహానికి కూడా నిజమైన హక్కుదారు పరమాత్మయే. పూజా గది అనేది ఆ యజమాని ఐన పరమాత్మ గది. మనము భగవంతుని సొత్తుకు నిజమైన సొంత దారులము కాము అనే భావన వలన మాత్రమె మన దురహంకారము, మనది అనే పెత్తందారి తనమును వదిలించుకోగలము.
మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే. మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము. ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి. అన్ని వేళలా ఆ ప్రదేశం శుభ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి (ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).
పరమాత్మ సర్వ వ్యాపి . ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి. భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము. పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.
ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది. ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి. అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము . పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి . మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము.
(అంతే కాని చేసే కొన్ని విధాలైన పనులు భగవంతుని ముందర చేయటానికి Guilty గా ఉంటుంది కదండీ అందుకు కాస్త దూరంగా ప్రత్యేక గది కట్టి అందులో భగవంతుణ్ణి బంధించేశాము అని మాత్రము దయచేసి అనకండి.)
నమస్తే ఎందుకు చెప్పాలి?
భారతీయులు ఒకరినొకరు 'నమస్తే' అని పలకరించు కుంటారు. నమస్తే అన్నప్పుడు తల వంచి రెండు అరచేతులు హృదయం ముందర కలపడము జరుగుతుంది. మనకన్నా చిన్నవారైనా, సమ వయస్కులైనా, పెద్దవారైనా స్నేహితులైనా మరియు కొత్తవారైనా కూడా ఇదే విధముగా నమస్తే అని పలకరించాలి.
శాస్త్రాలలో సంప్రదాయ బద్ధమైన ఐదు రకాల అభివందనములు ఉన్నాయి. అందులో నమస్కారము ఒకటి. నమస్కారము అంటే సాగిలపడుట అనే అర్ధము వస్తుంది. కానీ నమస్తే అంటే ఈ రోజుల్లో మనము ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఇచ్చి పుచ్చుకునే మర్యాదగా గ్రహించాలి.
నమస్తే ఎందుకు చేయాలి?
నమస్తే అనేటటువంటిది మామూలుగా అలవాటుగా చేసేటటువంటి వందనమో, సంప్రదాయబద్ధమైన ఆచారమో లేక భగవదారాధనో అయి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఈ ఆచారములో మనకు తెలియని చాలా లోతైన అర్ధము ఉంది . సంస్కృతములో నమః+తే = నమస్తే. దీని అర్ధము - నేను నీకు నమస్కరిస్తున్నాను అని. నమః అనే పదాన్ని "న", "మః" గా విడదీయవచ్చు - నాది కాదు అనే అర్ధము వస్తుంది. ఇతరుల సన్నిధిలో మన అహంకారాన్ని వదిలించుకొనే లేక తగ్గించుకొనే ఆధ్యాత్మిక సాధనను తెలియ జేసే ఆచారమిది.
వ్యక్తుల మధ్య నిజమైన కలయిక అంటే వారి మనస్సులు కలవడమే. అందుకే మనము ఇతరులను కలిసినప్పుడు నమస్తే అంటాము. అనగా 'మన మనసులు కలియుగాక' అని అర్ధము. హృదయం ముందర రెండు అరచేతులు కలపడము ఈ అర్థాన్నే సూచిస్తుంది. తల వంచడము అనేది ప్రేమతో వినయముగా మర్యాదని, స్నేహాన్ని అందించడాన్ని తెలియచేస్తుంది.
నమస్కారమనేది ఆధ్యాత్మ పరంగా ఇంకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది . ప్రాణ శక్తి, దివ్యత్వము; ఆత్మ లేక పరమాత్మ అందరిలో ఒకేలాగా ఉన్నది. ఈ ఏకత్వాన్ని గుర్తించి రెండు చేతులు కలిపి తల వంచి ఇతరులను కలిసినప్పుడు వారిలో ఉన్న దివ్యత్వానికి నమస్కరిస్తాము. మహాత్ములకు, భగవంతుడికి నమస్కారము చేసేటప్పుడు అందుకనే ఒక్కోసారి మనలోనున్న దివ్యత్వాన్ని చూసుకోవడానికా అన్నట్లు కనులు మూసుకొంటాము. దివ్యత్వాన్ని సూచించే విధముగా నమస్కారము ఒక్కోసారి భగవన్నామములతో ద్వారా కూడా చేయ బడుతుంది. ఈ ప్రాముఖ్యత తెలిసికొన్నప్పుడు నమస్కారము చేసేటప్పుడు పైపైకే నమస్తే అనడము గాక సరైనటువంటి స్నేహానికి దోహదము చేసే లాగున ప్రేమతోను గౌరవముతోను కూడిన వాతావరణాన్ని కలుగ చేయ గలము.
తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా క్రొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది. కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా (ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది.
సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నము. ఇది వారికి మనపై గల స్వార్ధరహిత ప్రేమ మరియు మన సంక్షేమానికి వారు చేసిన త్యాగాల పట్ల మన కృతజ్ఞతని తెలియజేస్తుంది. ఇది ఇతరుల గొప్పతనాన్ని అణకువతో అంగీకరించే ఒక మార్గము. భారతదేశము యొక్క గొప్ప శక్తులలో ఒకటైన పటిష్టమైన కుటుంబ బాంధవ్య వ్యవస్థను ప్రతిబింబింప జేసే ఆచారములలో ఇది ఒకటి.
భారత దేశములో పెద్దల శుభ సంకల్పాలకు మరియు అశీర్వాదములకు ఉన్నతమైన విలువ ఇవ్వబడుతుంది. వాటిని పొందడానికి మనము నమస్కరిస్తాము. మంచి ఆలోచనలు మంచి తరంగాలను సృష్టిస్తాయి. పరిపూర్ణమైన ప్రేమ, దివ్యత్వము మరియు ఉదారత్వముతో నిండిన హ్రుదయాలనుండి ఉద్భవించే శుభకామనలు అద్భుతమైన శక్తిని కల్గి ఉంటాయి. ఎప్పుడైతే మనము వినయముతో గౌరవముతో పెద్దలకు నమస్కరిస్తామో అప్పుడు వారి శుభకామనలు, దీవెనలు మంచి శక్తి వంతమైన తరంగ రూపంలో మనపై ప్రసరిస్తాయి. ఇందు వలననే మనము నిలబడి కానీ, సాగిలబడి కానీ నమస్కారము చేసినప్పుడు శరీరమంతా ఈ శక్తిని స్వీకరించ గలుగుతుంది.
గౌరవాన్ని తెలియపరచే వివిధ రీతులు:
ప్రతుత్థానము : లేచి నిలబడి స్వాగతమిచ్చుట
నమస్కారము : నమస్తే అని విధేయతను వ్యక్త పరచడము
ఉపసంగ్రహణ : పెద్దల, గురువుల పాదాలను తాకడము
సాష్టాంగము : కాళ్ళు, మోకాళ్ళు, ఉదరము, చాతి, నుదురు చేతులు అన్నీ నేలను తాకేలాగా పెద్దల ముందు సాగిలబడి నమస్కరించుట
ప్రత్యభివందనము: ప్రతి నమస్కారము చేయుట.
సంపద, వంశము, వయస్సు, నైతిక బలము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము ఒకదాని కంటే ఒకటి ఎక్కువ గా వ్యక్తులకు గౌరవాన్ని పొందే అర్హతను కల్గిస్తాయి. ఇందువలననే భూమిని పరిపాలించే రాజు ఐనప్పటికీ ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తాడు. ఈ భావాన్ని ప్రత్యేకంగా స్పష్టము చేసే కధలెన్నో మనకు రామాయణం, మహా భారతము వంటి ఇతిహాసాలలో గలవు.
ఈ సంప్రదాయము వలన కుటుంబము మరియు సంఘము లోని వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, గౌరవము, ఐకమత్యం, శాంతియుత వాతావరణము పెంపొందించ బడుతున్నాయి.
నుదుట బొట్టు పెట్టుకొంటాము. ఎందుకు?
దైవభక్తి గల భారతీయులు ప్రత్యేకించి వివాహితులు ఐన స్త్రీలు నుదిటి మీద తిలకము లేదా బొట్టు పెట్టుకొంటారు. ప్రతి రోజు స్నానము చేసిన తరువాత మరియు ప్రత్యేక సందర్భాలలోనూ, పూజ చేసే ముందర, తరువాత, లేక దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పక బొట్టు పెట్టుకుంటారు. చాలా తెగలలో వివాహితులైన స్త్రీలు ఎల్లా వేళలా నుదుట కుంకుమ పెట్టుకొనే కనిపించాలనే ఆదేశము ఉంది. వైదిక పద్దతులను ఆచరించే వారు మంత్ర ప్రార్ధనలతో కుంకుమ ధరిస్తారు. మహాత్ములకు మరియు దైవ ప్రతిమలకు ఆరాధనా సూచకంగా బొట్టు / తిలకం ధారణ జరుపుతాము. తిలకము వేరు వేరు రంగులలోను, రూపాలలోను ఉంటుంది.
నుదిటి పైన బొట్టు ఎందుకు?
నుదుటి పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది. దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది. మునుపటి కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు. పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు. క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు. వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు. శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు.
విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు. భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము. యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది. నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది. మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది. అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది.
మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు.
భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది. మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.
కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?
హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ కూడదని నేర్పించబడుతుంది. ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకద్దుకోవాలని పిల్లలకు నేర్పబడుతుంది.
కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?
భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది. అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి. ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము. కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.
చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది. చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి. జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము. మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .......
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!
పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి. పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.
ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?
మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప బడుతాడు. అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే. అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.
పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి. కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి. ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయి.
విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?
నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు. విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసికొంటారు.
విభూతిని ఎందుకు ధరించాలి?
భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము. "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము. హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది. నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది. మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది. శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది. అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు. మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు. ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది. అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు. కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము.
శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు. మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.
కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద. దానికి నాశనము లేదు. అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె.
"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
మనల్ని పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము. అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును గాక.
ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము ఎందుకు?
పాశ్చాత్య సాంప్రదాయములో క్రుతజ్ఞతా పరమైన ప్రార్ధన తరువాత తీసికోబడుతుంది. భారతీయులు దానిని భగవంతునికి నివేదన చేసిన తరువాత 'ప్రసాదం' గా స్వీకరిస్తారు. దేవాలయాలలో మరియు అనేకుల గృహాల్లోను ప్రతిరోజూ వండిన పరార్ధాలు ముందుగా భగవంతునికి నివేదిన్చబడతాయి. ఆ నివేదింపబడిన పదార్ధము మిగతా పదార్ధాలతో కలిపి ప్రసాదంగా వడ్డించ బడుతుంది. మన నిత్య పూజా కార్యక్రమంలో కూడా మనము భగవంతునికి 'నైవేద్యము' సమర్పిస్తాము.
మనము నైవేద్యము ఎందుకు సమర్పిస్తాము ?
భగవంతుడు సర్వ శక్తి వంతుడు మరియు సర్వజ్ఞుడు. భగవంతుడు పూర్ణుడయి ఉండగా మానవుడు అందులో అంశ మాత్రమె. మనము ఏ పనైనా భగవంతుడిచ్చిన శక్తి, జ్ఞానము వలన మాత్రమే చేయగలుగుతున్నాము. కావున జీవితములో మనం చేసే కర్మల ఫలితంగా మనము పొందేదంతా నిజానికి ఆయనదే. ఈ విషయము గ్రహించి ఆహారాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తాము. భగవంతునికి అర్పించిన తర్వాత అది ఆయన దివ్య స్పర్శ నొంది అనుగ్రహంతో మనకిచ్చిన కానుకగా మనచే స్వీకరించ బడుతుంది.
ఈ విషయం తెలిసికొన్న తరువాత ఆహారం పట్ల, ఆహారం తినే విదానంపట్ల మన వైఖరి పూర్తిగా మారుతుంది. సాధారణంగా నివేదిమ్పబడిన ఆహారము పవిత్రంగాను, ఉత్తమమైనది గాను ఉంటుంది. మనము దానిని స్వీకరించే ముందర ఇతరులతో పంచుకొంటాము. మనము ఆహారాన్ని అధికార పూర్వకముగా అడగకూడదు. అసంతృప్తి పడకూడదు లేక మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించ కూడదు. మనము దానిని సంతోషముగా ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఈ విధముగా ప్రసాద భావన పెంపొందింప చేసుకొంటే కేవలము ఆహారము పట్లనే కాక మన జీవితములో లభించే అన్నింటిని కూడా ప్రసాదంగా సంతోషముగా స్వీకరించగలము.
ప్రతిరోజు భోజనాన్ని ముందర పవిత్రము చేసే చర్యగా కంచం చుట్టూ నీరు చల్లుతాము. కంచం ప్రక్కగా ఐదు ముద్దలను మనచేత చెల్లించబడే రుణాలకి ప్రతీకగా ఉంచుతాము.
1) దేవ ఋణం : దేవతల దయార్ద్ర అనుగ్రహము మరియు రక్షణలకు.
2) పిత్రు ఋణం : పితృ దేవతలకి వంశ పారంపర్యత్వాన్ని మరియు సంస్కృతిని ఇచ్చినందుకు.
2) భూత ఋణం : ఎవరి ఆలంబన లేనిదే ఈ సంఘములో మనము జీవిన్చాలేమో ఆ సంఘాన్ని ఏర్పరిచిన వారు.
3) రుషి ఋణం : మన మతమును మరియు సంస్కృతిని గుర్తింపచేసి, వృద్ధి పరచి, తద్వారా మనకందించినందుకు
4) మనుష్య ఋణం .. ఇతర ప్రాణులు స్వలాభాపేక్ష లేకుండా మనల్ని సేవిస్తున్నందుకు
ఆ తర్వాత పంచ ప్రాణాలుగా శరీరాన్ని నిలబెట్టే ప్రాణ శక్తిగా మనలో ఉన్న భగవంతుడికి ప్రాణాయా స్వాహా; అపానాయ స్వాహా; వ్యానాయ స్వాహా; ఉదానాయ స్వాహా; సమానాయ స్వాహా అని చెపుతూ నివేదించ బడుతుంది. పంచ ప్రాణాలు ఈ క్రింది విధముగా శారీరక విధులు నిర్వహిస్తాయి.
1) ప్రాణము ... శ్వాస కొశమును చైతన్య వంతము గావిస్తుంది.
2) వ్యానము ... నాడీ వ్యవస్థను నియంత్రింప చేస్తుంది
3) అపానము ... వ్యర్ధ పరార్ధాలను బయటకు త్రోస్తుంది.
4) సమానము ... జీర్ణ క్రియను చైతన్య వంతము చేసి శరీరానికంతటికి శక్తి సరఫరా చేస్తుంది.
5) ఉదానము ... ఎక్కిళ్ళు మొదలగునవి కల్గించేది, ఆలోచనా శక్తి నిచ్చేది. పై విధంగా నివేదించబడిన తరువాత ఆహారం ప్రసాదంగా తీసికోబడుతుంది. ఈ భావన గుర్తు చేసి కోవడానికి భగవద్గీత లోని ఈ శ్లోకాలను చదువుతారు.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించి బ్రహ్మమనే హవిస్సు బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మముచేత హోమం చేయబడేది బ్రహ్మమే. దానిద్వారా అందుకోవలసిన గమ్యం కూడా బ్రహ్మమే.
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
నేను వైశ్వానరుడినై ప్రాణుల దేహాలను ఆశ్రయించి ప్రాణాపానములతో కూడికొని చతుర్విధ అన్నాన్ని పచనము చేస్తున్నాను.
ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?
మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.
ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?
ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదత ను తెలుపుతుంది. ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ / రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు. అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం. ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము.
భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక! ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.
సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!
మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?
ప్రాచీన కాలము నుంచీ భారతీయులు మొక్కలనీ వృక్షాలనీ పవిత్ర భావన తో పూజిస్తున్నారు. ఆయా ప్రదేశము లందలి వృక్ష, జంతు స్థావరాలన్నింటినీ పవిత్ర భావనతో గౌరవిస్తున్నారు. ఇది ఒక మూఢ ఆచారము లేక అనాగరిక చర్య కాదు. ఇది భారత సంస్కృతి యొక్క జ్ఞానాన్ని, దూరదృష్టిని మరియు మంచి సంస్కారాన్ని తెలియ పరుస్తున్నది. పురాతన భారతీయులు ప్రకృతి మాతను పూజించారు. ఆధునిక మానవుడు ప్రకృతిని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
మనము మొక్కలనీ, వృక్షాలనీ ఎందుకు పవిత్రంగా భావిస్తాము?
మనలో జీవ శక్తి గా ఉన్న భగవంతుడే మొక్కలు, జంతువులు మొదలైన అన్ని ప్రాణులలోను వ్యాపించి ఉన్నాడు. అందువలననే మొక్కలైనప్పటికీ, జంతువులైనప్పటికీ వాటి నన్నింటినీ పవిత్రమైనవి గా పరిగణిస్తాము. ఈ భూమి మీద మానవుడి జీవితము మొక్కలపై మరియు వృక్షాలపై ఆధారపడి ఉంది. అవి మన మనుగడకు అవసరమైన ఆహారము, ప్రాణ వాయువు, వస్త్రాలు, వసతి, ఔషధాలు మొదలైన ప్రాణాధార వనరులను అందిస్తున్నాయి. మన పరిసరాలకు సుందరత్వాన్ని కలిగిస్తున్నాయి. ఏమీ ఆశించకుండా మానవుడికి సేవచేస్తూ మనము జీవించడానికి వాటి జీవితాల్ని అర్పిస్తున్నాయి. త్యాగానికి ఉదాహరణగా నిలబడి ఉన్నాయి. ఫలభరితమైన చెట్టు పైకి రాయి విసిరితే ఆ చెట్టు బదులుగా ఫలాన్ని ఇస్తున్నది.
నిజానికి భూమి మీద మానవుడికన్నా ముందే వృక్ష జంతు సమూహాలు నివసించేయి. ప్రస్తుతము వాటి పట్ల మానవుని కఠిన వైఖరి వలన వన్య ప్రాంతాలు నాశనము చేయడము వలన ఎన్నో రకాల వృక్షజాతిని నశింప చేయడము వలన ప్రపంచము తీవ్రమైన భయాన్దోళనలకు గురి అగుచున్నది. మనము వేటికి విలువ ఇస్తామో వాటినే రక్షించుకొంటాము. అందుకే భారత దేశములో మొక్కలను వృక్షాలను పవిత్రమైనవిగా గౌరవించడము చిన్నప్పట్నుంచే నేర్పబడుతుంది. అప్పుడే స్వతహాగా వాటిని మనము రక్షించుకొంటాము.
ఏ కారణముచేతనైనా ఒక చెట్టును నరుక వలసివస్తే పది చెట్లను నాటాలని భారతీయ పవిత్ర గ్రంధాలు చెప్తున్నాయి. మనకు ఆహారము, వంటచెరకు వసతి మొదలైన వాటికి అవసరమైనంత వరకు మాత్రమే మొక్కల వృక్షాల భాగాలను వాడుకోవాలని చెప్పబడింది. అంతే కాకుండా చెట్టును నరికిన పాపము రాకుండా ఉండాలంటే ఒక మొక్కను లేక చెట్టును కోయబోయే ముందు క్షమాపణ అడగవలసిందిగా కూడా చెప్పబడుతున్నది. మొక్కలు, వృక్షాలు చేసే త్యాగ సేవల గురించి మరియు వాటిని పోషించవలసిన మన బాధ్యత గురించిన కథలు చిన్నతనము నుంచే చెప్ప బడతాయి. అద్భుతమైన ప్రయోజనకర గుణాలు కల్గిన తులసి, రావి మొదలైన మొక్కలు, వృక్షాలు నేటికీ పూజింప బడుతున్నాయి. దేవతలు మొక్కలు మరియు వృక్షాల రూపములో ఉన్నారనే నమ్మకము వలన అనేకులు వారి కోరికలను తీర్చుకొనుటకు మరియు భగవంతుడిని సంతోష పరచుటకు వాటిని పూజిస్తారు.
ఉపవాసం ఎందుకు చేయాలి?
భక్తి శ్రద్దలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము ఉంటారు. కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు. ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేస్తారు. గాంధీ గారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేసారు.
ఉపవాసం ఎందుకు చేస్తాము?
ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకుని విందు ఆరగించాదానికా? నిజానికి అందుకు కాదు. మరి మనమెందుకు ఉపవాసం చేస్తాము?
సంస్కృతంలో ఉప అంటే 'దగ్గరగా' + వాస అంటే 'ఉండడం' అని అర్ధము. కాబట్టి ఉపవాసము అంటే దగ్గరా (ఆ భగవంతుడి) ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం. మరి ఉపవాసం - ఆహారముల మధ్య ఏమిటి సంబంధము?
కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది. అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలనుకుంటాడు. తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది. అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది. తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.
ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ మరియు పూర్తి విరామము అవసరము. ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది.
ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావలెననును. ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.
ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను మరియు తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు. ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు. మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు. మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.
దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?
చాలా దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేక ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి మరియు ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు. పిల్లలు ఎత్తుగా ఉన్న గంటను పైకి ఎగిరి లేక ఎత్తుకోబడి మ్రోగించడానికి ఇష్టపడతారు.
మనము గంటను ఎందుకు మ్రోగిస్తాము?
భగవంతుడిని నిద్ర లేపడానికా? కానీ దేవుడు ఎప్పుడూ నిద్రపోదు. భగవంతునికి మనము వచ్చినట్లు తెలియచేయడానికా? ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తెలుపవలసిన అవసరము లేదు. ఆయన ప్రాంగణము లోనికి రావడానికి అనుమతి కొరకా? అది స్వంత ఇంటికి వస్తున్నట్లే గనుక రావడానికి అనుమతి తీసికొన అవసరము లేదు. భగవంతుడు మనలని ఎల్లవేళలా ఆహ్వానిస్తుంటాడు.
మరి మనం గంటను ఎందుకు మ్రోగిస్తున్నట్లు?
గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దము మంగళకరమైన ధ్వనిగా పరిగణించ బడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమయిన 'ఓంకార' నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని యొక్క దర్శనము పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట మ్రోగిస్తాం.
వైదిక క్రియా పరంగా 'హారతి' ఇచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది. మ్రోగే గంట, శంఖము మరియు ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి. ఇది గంట మ్రోగించడము లోని అదనపు సంకేతము.
మనము చేసే నిత్య పూజ ఆరంభములో ఇలా చెపుతూ గంటను వాయిస్తాము.
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దాని వలన సద్గుణ దైవీ పరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాలనుండి వైదొలగు గాక!
కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
ముందుగా అసలు కలశము అంటే ఏమిటి?
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. ఆ పాత్ర చిత్రములతో కూడా అలంకరించబడి ఉండవచ్చు. అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు "పూర్ణకుంభము" అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తి తో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.
సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో 'కలశము' ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.
మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహా విష్ణువు పాల సముద్రములో తన నాగశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు . కలశములొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీక గా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్దముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందుగా నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది. అందువల్లనే 'కలశం' శుభసూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.
అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించ బడిన తరువాత అందులోని నీరు "అభిషేకము" తో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.
పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీక గా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభము తో హృదయ పూర్వకముగా స్వాగతమిస్తాము.
తులసిని పూజిస్తాము ఎందుకు?
హిందువుల గృహాలలో ముందర, వెనుక లేక పెరట్లో మధ్య స్థలంలో 'తులసి కోట నిర్మించబడి ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాల (అపార్టుమెంట్లు) లోని వారు కూడా పూల తొట్టెలలో తులసి మొక్కను పోషించుకొంటున్నారు. ఇంటి ఇల్లాలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తుంది. తులసి మొక్క ఆకులు, విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు పవిత్రమైనవిగా పరిగణించ బడతాయి. భగవంతునికి నివేదింపబడే నైవేద్యములో ఎప్పుడూ తులసి ఆకులు ఉంచబడతాయి. భగవంతుడికి చేసే పూజలలో, ప్రత్యేకించి శ్రీ మహావిష్ణు అవతార మూర్తుల పూజలలో తులసి సమర్పించ బడుతుంది.
మనము తులసిని ఎందుకు పూజిస్తాము?
సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది తులసి (దాని లక్షణాలలో) అని అర్ధము. భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి.
వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు.
ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత. ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య. ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు. తులసి ఆకుని సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే. అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని పూజలలో తులసి వాడకూడదు అంటారు. విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).
ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగ వరమిచ్చాడు. అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం జరుపుతాము. ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి ప్రతీక. ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు.
ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారము చేస్తుంది. కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు. ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర పోషించినది.
తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది. జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది.
తులసి మాల తో జపం చేస్తే చిత్తశుద్ది త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది. చిత్తశుద్ది కి తులసి మాల ఉత్తమం.
తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:
యన్మూలే సర్వ తీర్ధాణి యదగ్రే సర్వ దేవతాః
యన్మధ్యే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహమ్
ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.
తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము - ఎందుకు?
తామర పూవు భారత దేశ జాతీయ పుష్పముగా గుర్తింపు పొందినది. ఈ గుర్తింపు సరైనటువంటిదే. కొద్ది కాలము క్రితము వరకు కూడా భారత దేశపు చెరువులు, కొలనులు ఎన్నో రంగు రంగుల తామర పుష్పములతో నిండి ఉండేవి.
తామర పూవుని ప్రత్యెకమైనదిగా పరిగణించుట ఎందుకు?
తామర పూవు సత్యము పవిత్రత మరియు సుందరత్వానికి ప్రతీక. భగవంతుని స్వభావము కూడా సత్యం శివం సుందరమూ. కనుక అతని వివిధ భాగాలు పద్మముతో పోల్చబడతాయి. మన వేదాలు, ఇతిహాసాలు తామర పూవు అందాలని స్తుతించుతాయి. చిత్రకళ శాస్త్రములు కూడా తామర పూవుని వివిధ అలంకారయుత చిత్రాలుగా చిత్రీకరిస్తుంటాయి. చాలా మంది తామర పూవు లేదా దానికి సంబంధించిన పేర్లను కలిగి ఉంటారు. సంపదకు అధి దేవత ఐన లక్ష్మీ దేవి ఒక తామర పూవు పైన ఆసీనమై మరొక తామర పూవుని తన హస్తముతో పట్టుకొని ఉంటుంది.
తామర పూవు ఉదయించే సూర్యునితో పాటు విచ్చుకొని రాత్రికి ముడుచుకొని పోతుంది. అదే విధంగా మన బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికాసము, వృద్ధి చెందుతాయి. తామర పూవు బురద గుంటల్లో కూడా పెరుగుతుంది. దాని పరిసరాలు ఏ విధముగా ఉన్నప్పటికీ తాను మాత్రము కళంకము లేకుండా అందంగా ఉంటుంది. మనము కూడా బాహ్య పరిస్థితులు ఏ రకముగా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యము చెదరకుండా ఉండాలని, ఉండగలగటానికి పాటుపడాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నీళ్ళలోనే ఉన్నప్పటికీ తామర ఆకుకి తడి అంటుకోదు. జ్ఞాని దుఃఖాలతోను మార్పులతోనూ కూడుకొన్న ప్రపంచములో ఉన్నప్పటికీ వాటికి చలించకుండా ఆత్మానందములోనె లీనమై ఉంటాదనడానికి ప్రతీకగా ఈ విషయము నిలుస్తుంది. భగవద్గీత లోని ఒక శ్లోకము ద్వారా ఈ విషయము తెలియజేయ బడింది.
బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే నసపాపేన పద్మ పాత్ర మివాంభసా
భగవంతుడికి అర్పించి ఫలాపేక్ష వదిలి, ఎవరు కర్మలు చేస్తారో, తామరాకుకి నీరు లాగ వారికి పాపము అంటుకోదు.
దీనివలన జనానికి ఏదైతే సహజ లక్షణమో అది సాధకులందరికీ ఆధ్యాత్మ అన్వేషకులకి భక్తులకి ఆచరించ వలసిన క్రమ శిక్షణ అవుతుందని మనము తెలుసుకొన్నాము.
యోగ శాస్త్ర ప్రకారము మన దేహాలు శక్తి కేంద్రాలయిన కొన్ని చక్రాలను కలిగి ఉన్నాయి. ప్రతి చక్రము నియమిత దళముల పద్మమును కల్గి ఉంటుంది. ఉదాహరణకు శిరోభాగమున గల సహస్ర చక్రము, యోగి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు వికసిస్తుంది. దీనిని వెయ్యి దళములు గల పద్మముతో సూచిస్తారు. అంతే కాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనము సిఫారసు చేయబడింది.
విష్ణు భగవానుని నాభి నుంచీ ఆవిర్భవించిన తామర పూవు నుండి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికై ఉద్భవించాడు. ఆ విధముగా తామరపూవు సృష్టి కర్తకీ మరియు పరమాత్మకు గల సంబంధానికి చిహ్నంగా నిలుస్తున్నది. ఇది బ్రహ్మదేవుని నివాస స్థానమైన బ్రహ్మలోకానికి కూడా చిహ్నము.
శుభ సూచకమైన స్వస్తిక్ గుర్తు కూడా తామర పూవు నుంచే వెలువడినట్లు చెప్పబడుతుంది.
తామర భారత జాతీయ పుష్పముగా ఎందుకు ఎన్నుకోబడినదో, భారతీయులకి ఎందుకది అంత ప్రత్యేకమైనదో మనము పై విషయాల ద్వారా చక్కగా తెలుసుకున్నాము.
శంఖము ఎందుకు ఊదుతాము?
దేవాలయాలలో గానీ ఇళ్ళలో గానీ శాస్త్రోక్త పూజారంభ సమయములో ఒక్కసారి లేక అనేక సార్లు శంఖము పూరించ బడుతుంది. హారతి ఇచ్చేటప్పుడు గానీ లేక సుభసూచకమైన సందర్భాన్ని గుర్తించడానికి గానీ శంఖము ఊదబడుతుంది. యుద్ధం ఆరంభించడానికి ముందర లేక సైన్యపు విజయాన్ని ప్రకటించడానికి గానీ శంఖారావము చేయబడుతుంది. శంఖము దైవ పీఠము వద్ద కూడా పెట్టి పూజించ బడుతుంది.
శంఖము ఎందుకు ఊదుతాము.
ఎప్పుడైతే శంఖము ఊదబడుతుందో, అప్పుడు అందుండి సృష్టికి మూలభూతమైన ప్రణవ నాదము వెలువడుతుంది. ఓంకారము సృష్టికి పూర్వము భగవంతునిచే చేయబడిన మంగళకరమైన నాదము. అది ప్రపంచానికి, దానికి ఆధారమైన సత్యానికి ప్రతినిధి.
ఒక కథనం ప్రకారం శంఖాసురుడనే రాక్షసుడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రపు అడుగు భాగములోకి వెళ్ళాడు. దేవతలు సహాయము కొరకు విష్ణుమూర్తికి విన్నవించుకొన్నారు. శ్రీ మహావిష్ణు 'మత్స్యావతారము' ధరించి శంఖాసురుణ్ణి సంహరించాడు. భగవానుడు శంఖాకారములో ఉన్న అతని చెవి మరియు తల ఎముకను ఊదగా అందుండి వేదాలను ఉద్భవిమ్పచేసినట్టి నాదము వెలువడింది. వేదాలలో ఉన్న జ్ఞానమంతా ఓంకారము యొక్క వివరణయే. శంఖము 'శంఖాసురుని' మరణానంతరము 'శంఖము' గా పిలవబడుచున్నది. భగవానునిచే పూరించబడిన శంఖము 'పాంచ జన్యము' గా పిలువ బడుచున్నది. ఆయన నాలుగు చేతులలోని ఒక చేతిలో ఎల్లవేళలలో శంఖము పట్టుకొని ఉంటాడు. అది జీవితపు చతుర్విధ పురుషార్ధాలలో ఒకటయిన 'ధర్మము' లేక ధర్మశీలతకుప్రతీక . అందువల్లనే శంఖారావము అధర్మముపై ధర్మము యొక్క విజయానికి సంకేతము. శంఖాన్ని మన చెవులకి దగ్గరగా పెట్టుకొంటే సముద్రపు అలల హోరు వినబడుతుంది.
భక్తుల మనసులను వాతావరణమును కలవరపెట్టే వ్యతిరేక వ్యాఖ్యానాలను మోతలను పూర్తిగా తరిమెయ్యడానికి గాను శంఖము మరియు ఇతర వాయిద్యాలను మ్రోగించి మంగళకరమైన ధ్వనులను ఉత్పన్నము చేయడము అనేది మరియొక ముఖ్య ఉద్దేశ్యము.
పురాతన భారత దేశము గ్రామాలలో నివసిస్తూ ఉండేది. ప్రతి గ్రామము ఒక ప్రధాన దేవాలయము మరియు అనేక చిన్న దేవాలయాల అధ్యక్షతలో ఉండేది. ప్రతి ముఖ్యమైన పూజ ముగింపులోను మరియు పుణ్య దినాలలోనూ హారతి తో పాటు శంఖారావము చేయబడుతుంది. సాధారణంగా గ్రామము చిన్నదిగా ఉండడం వలన ఆ శంఖనాదం ఊరంతటికీ వినిపించేది. దేవాలయానికి వెళ్ళడానికి వీలుకాని ప్రజలంతా వారు ఏ పని చేస్తున్నా ఆ పని ఆపి కొన్ని క్షణాల పాటైనా మానసికంగా భగవంతుడికి ప్రణమిల్లాలని గుర్తు చేయబడేది. ఈ శంఖ నాదం తీరిక లేని నిత్య కృత్యాల మధ్య నున్న ప్రజల మనసులని కూడా భక్తి భావాలతో నింపుతూ సేవను అందించేది.
నాద బ్రహ్మము, సత్యము, వేదాలు, ఓంకారము, ధర్మమూ, విజయము మరియు శుభసూచకాలకి ప్రతీకగా దేవాలయాల లోను, ఇళ్ళలోనూ, దైవ పీఠము వద్ద, భగవంతునికి ప్రక్కగా శంఖము ఉంచ బడుతుంది. భక్తుల మనసులు ఉన్నతమై సత్యం వైపు ఎదగడానికి ఇచ్చే తీర్ధమునకు కూడా శంఖము వాడ బడుతుంది.
ఈ క్రింది శ్లోకముతో శంఖము పూజింపబడుతుంది.
త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విద్రుతః కరే
దేవైశ్చ పూజితః సర్వైః పాంచజన్యం నమోస్తుతే
సముద్రములో పుట్టిన, విష్ణుమూర్తి చేత బట్టిన మరియు దేవతలందరిచే పూజింపబడిన పాంచజన్యమను శంఖమునకు వందనము.
శాంతి వచనము మూడు సార్లు చెప్తాము - ఎందుకు?
శాంతి అంటే అర్ధము ప్రశాంతత, అదే జీవి యొక్క సహజమైన స్థితి. సహజ స్థితి ని భంగం కలిగించేవి అన్నీ అశాశ్వతాలే. శబ్దాలు, ఆందోళనలు మరి ఏ ఇతర అడ్డంకులు మనచే గానీ ఇతరులచే గానీ కలిగిం చబడతాయి. ఉదాహరణకి ఒక స్థలములో ఎవరైనా శబ్దము చేసే వరకు అక్కడ ఉండేది ప్రశాంతతే. కాబట్టి మన అన్ని ఆందోళనలు అంతర్లీనంగా శాంతిని కలిగే ఉన్నాయి. ఆందోళనలు ముగిసిన వెంటనే అప్పటికే అక్కడ ఉన్నందువల్ల శాంతి సహజంగానే అనుభవంలోనికి వస్తుంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. అందువలన ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ తన జీవితంలో శాంతిని కోరుకుంటారు. ఐనప్పటికీ మన స్వంత ఆందోళనల చేత కప్పివేయబడినందువల్ల, అంతరంగికంగా గానీ బాహ్యంగా గానీ 'శాంతి' ని పొందడము చాల కష్టమనిపిస్తుంది. చాల అరుదైన కొందరు మాత్రమే బాహ్యమైన ఆందోళనలు, కష్టాల మధ్య కూడా శాంతియుతంగా ఉండ గలుగుతారు. మనము శాంతిని పొందడానికి ప్రార్ధనలు చేస్తాము. ప్రార్ధనలు చేయడం వలన కష్టాలు ముగిసి బాహ్యఆందోళనలతో సంబంధం లేకుండా అంతరంగికంగా శాంతి అనుభవములోకి వస్తుంది. అటువంటి ప్రార్ధనలన్నీ మూడు సార్లు శాంతి పలకడముతో ముగుస్తాయి.
మనము మూడు సార్లు శాంతి వచనము ఎందుకు చెప్తాము?
'త్రివారం సత్యం' అనబడుతుంది. ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు అదే విషయాన్ని పునరావృతం చేస్తాము. న్యాయ స్థానము లో కూడా, సాక్ష్యం చెప్పడానికి నిలబడినవారు "నేను నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరి ఇంకేమి చెప్పను" అని మూడు సార్లు చెప్తారు. మనకు శాంతి పొందాలన్న కోరిక యొక్క తీవ్రతను నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు శాంతి వచనము వల్లిస్తాము.
అన్ని రకాల విఘ్నాలు, సమస్యలు, మరియు దుఃఖాలు మూడు విధాలుగా ఉత్పన్నమవుతాయి.
1. అధిదైవిక: ఏ మాత్రము మన అదుపులో లేని దైవీ శక్తుల వలన ఏర్పడే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలగునవి.
2. అధిభూత: మనచుట్టూ ఉండి మనకు తెలిసిన ప్రమాదాలు, మానవ సంబంధాలు, కాలుష్యము నేరములు మొదలగునవి.
3. ఆధ్యాత్మిక: శారీరక వ్యాధులు, కోపము, నిరుత్సాహము వంటి మానసిక సమస్యలు.
మనమేదైనా ప్రత్యేకమైన పని చేసేటప్పుడు మరియు నిత్య జీవితములో పైన వివరించబడిన మూడు మూలకారణాల వలన ఏ సమస్యలు లేకుండగా లేక సమస్యలను తగ్గించమని "శాంతి ఒక్కటే ఉండుగాక!" అని భగవంతుని ప్రార్థిస్థాము. కాబట్టి మూడు సార్లు శాంతి వచనము చేయబడుతుంది.
మొదటి సారి దూరంగా ఉన్న అవ్యక్త శక్తులను ఉద్దేశించి శాంతి వచనము చేయబడుతుంది. మన వెనువెంట ఉన్న పరిసరాలను మరియు చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను ఉద్దేశించి రెండవసారి కొంత మృదువు గాను; తమకు తాము ఉద్దేశించి చివరి సారి బాగా మృదువుగాను శాంతి వచనము చేయబడుతుంది.
కొబ్బరి కాయను నివేదిస్తాము - ఎందుకు?
భారత దేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదనలలో కొబ్బరికాయ ఒకటి. వివాహములు పండుగలు, కొత్త వాహనము, వంతెన, ఇల్లు మొదలగునవి వాడేటప్పుడు మరియు అన్ని శుభ సందర్భాలలోనూ కొబ్బరికాయ నివేదింపబడుతుంది. నీటితో నిండి మామిడి ఆకులతో అలంకరింపబడి దానిపై కొబ్బరికాయ ఉన్న కలశమును ముఖ్యమైన పూజా సందర్భాలలో మరియు ప్రత్యేక అతిథులను ఆహ్వానించడానికి ఉపయోగించబడుతుంది.
హోమము చేసే సమయములో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించ బడుతుంది. భగవంతుని మెప్పుకై, కోరికలు తీర్చుకొనడానికి కొబ్బరికాయ పగుల గొట్టబడి స్వామికి నైవేద్యముగా పెట్టబడుతుంది. తరువాత ప్రసాదముగా పంచ బడుతుంది.
ఒకానొకప్పుడు మనలోని జంతు ప్రవృత్తులను భగవంతునికి సమర్పించడానికి గుర్తుగా జంతుబలి అమలులో ఉండేది. నెమ్మదిగా ఆ ఆచారము తగ్గిపోయి దానికి బదులుగా కొబ్బరికాయ నివేదించ బడుతున్నది. ఎండిన కొబ్బరి కాయకు పై భాగములో పిలకకోసం మాత్రము వదిలి, మిగతా పీచు అంతా తీసి వెయ బడుతుంది. పైన ఉన్న గుర్తులు మానవుని తల మాదిరిగా కనిపిస్తాయి. పగిలిన కొబ్బరికాయ అహంకారము యొక్క విరుపును ప్రతిబింబింప చేస్తుంది. మనలోని అంతరంగ ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరితో సహా భగవంతునికి నివేదింప బడతాయి. భగవంతుని స్పర్శతో శుద్ధి అయిన మనసు ప్రసాదం గా వినియోగించ బడుతుంది. దేవాలయాల్లోనూ ఇళ్ళల్లోను చేసే సంప్రదాయ బద్దమైన పంచామృత అభిషేక ప్రక్రియలో విగ్రహం పైనుంచీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధపు మిశ్రమము, విభూతి మొదలగు వాటితో అభిషేకము చేస్తారు. ప్రతి ఒక్క పదార్ధము భక్తులకి ప్రయోజనాలను కల్గించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గలిగి ఉన్నది. సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.
కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక. చెట్టు యొక్క ప్రతి భాగము - మ్రాను, ఆకులు, కాయ, పీచు మొదలైనవి ఇంటి కప్పు, చాపలు రుచికరమైన వంటకాలు, తైలము, సబ్బులు మొదలైన వాటి తయారీ లో ఉపయోగించ బడతాయి. ఇది భూమిలోనుంచి ఉప్పు నీటిని తీసికొని బలవర్ధకమైన నీటిగా మార్చుతుంది. ఈ నీరు ప్రత్యేకముగా రోగులకు ఉపయోగ పడుతుంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలోను వాడబడుతుంది.
కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినేత్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు. అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించ బడుతుంది. కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి మరియు జ్ఞానికి ప్రతీకగా కొబ్బరి కాయ కలశం పై పెట్టబడి అలంకరింపబడి, మాలాలంకృతము చేయబడి పూజింపబడుతుంది.
ఓంకారము పలుకుతాము - ఎందుకు?
భారత దేశములో ఎక్కువగా పలుకబడే శబ్ద చిహ్నము ఓంకారము. ఓంకారము - ధ్వనింపచేసే వారి శరీరము, మనసులపైన మరియు పరిసరాల పైన కూడా పరిపూర్ణ ప్రభావము ఉంటుంది. చాలా మంత్రాలు, వైదిక ప్రార్ధనలు ఓంకారముతో ఆరంభమవుతాయి. ఓంహరిఃఓం మొదలైన అభినందనలలో కూడా అది వాడబడుతుంది. దాని ఆకారము పూజింపబడుతుంది. దానిపై భావన చేయబడుతుంది. శుభసూచకంగా వాడబడుతుంది. ఇది మంత్రము మాదిరి గానే పదే పదే జపించ బడుతుంది.
ఓంకారము ఎందుకు చేస్తాము?
ఓం అనేది భగవంతుని యొక్క ప్రధమ నామము. అది అ, ఉ, మ అనే అక్షరాల కలయిక వలన ఏర్పడినది. స్వరస్నాయువుల నుండీ వెలువడే శబ్దము గొంతు యొక్క అడుగు భాగము నుంచీ 'అ'కారముగా ఆరంభమవుతుంది. పెదిమలు మూసుకొన్నప్పుడు 'మ'కారము తో శబ్దము ఆగిపోతుంది. మూడు అక్షరాలూ, మూడు అవస్థలు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి), ముగ్గురు దేవతలు (బ్రహ్మ విష్ణు, మహేశ్వర), మూడు వేదాలు (ఋగ్, యజుర్, సామ), మూడు లోకాలు (భూః, భువః, సువః) మొదలైన వాటికి ప్రతీకలు. ఇవి అన్నీ మరియు వీటన్నింటికి ఆవల ఉన్నవాడు "భగవంతుడు" రెండు ఓంకార ధ్వనుల మధ్యనున్న నిశ్శబ్దము నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఓంకారం ప్రణవము అని కూడా పిలువబడుతుంది ("దేని ద్వారా అయితే భగవంతుడు స్తుతించ బడతాడో" అని అర్ధము). వేదాలలోని సారమంతా "ఓం" అనే పవిత్రాక్షరములో నిక్షిప్తమైనది.
భగవంతుడు ఓంకారము మరియు 'అథ' అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం ఆరంభించాడని చెప్ప బడుతుంది. కాబట్టే మనం తలపెట్టే ఏ పని ఆరంభము లోనయినా ఓంకార నాదము శుభ సూచకంగా పరిగణించ బడుతుంది.
ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి (ఓంooooo...మ్ మ్) అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది. మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు.
ఓంకారం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయ బడుతుంది. సర్వ సాధారణమైన ఓం ఆకారము గణేశుడికి చిహ్నముగా ఉంటుంది. పైన ఉన్న వంపు తల, క్రిందగా ఉన్న పెద్ద వంపు పొట్ట ప్రక్కగా ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము.
ఈ విధముగా ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.
హారతి ఇస్తాము - ఎందుకు?
భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది.
ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము. ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది. చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.
మనము చిన్నప్పటి నుంచీ ఈ ప్రక్రియను చూస్తున్నాము. అందులో పాల్గొంటున్నాము. మనము హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాము.
ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము. దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది. గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి.
హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది. కర్పూరాన్ని వెలిగించినపుడు ఏ మాత్రము చాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది. కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక. జ్ఞానమనే అగ్నిచేత వెలిగించ బడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింప చేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్దము చేసి భగవంతుడి నుంచి దూరము చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది. కర్పూరము వెలుగుతున్నప్పుడు భగవంతుని విభూతిని శోభను తెలుపడానికి అది తనను తాను ఆహుతి చేసుకొంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మనము మన గురువునీ సంఘాన్నీ సేవించుకుంటూ అందరికి 'ప్రేమ' అనే 'సుగంధాన్ని' వ్యాపింపచేయడానికి మనస్పూర్తిగా మనలని మనము అర్పించుకోవాలి.
తరచూ మనము ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము. కానీ మనలోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి. మన దేహము దేవుని ఆలయమనీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది. పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువు గారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయముతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు. హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తలపైభాగానికి అడ్డుకోవడమంటే అర్ధము - భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగు గాక నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివి గాను ఉండుగాక! అని ప్రార్ధించడం.
హారతికి వేదాన్తపరమైన అర్ధము; సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ మరియు అగ్ని - ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు. సృష్టిలోని అద్భుతమైన అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారము. ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటమూ మరియు ప్రకాశించడమూ జరుగుతుంది. హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాము.
సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు. భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యము. అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు. మనసు భావింపలేదు. నాలుక మాట్లాడ లేదు. మనసు బుద్ధి మరియు వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే. ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపజేయగలవు. అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధముగా స్తుతిస్తాము.
న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతొ2 యమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, ఆయన ఉన్నాడు. మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్న) ఏమి చేయగలదు? ప్రతిదీ అతని వలననే ప్రకాశిస్తాయి. అతని వెలుగు వలన మాత్రమె మనమంతా ప్రకాశింప బడుతున్నాము.
-------------------------------
అష్టదిక్పాలకులు
వారి ప్రాధాన్యత
ప్రతి ఇంటికి ఎనిమిది
దిక్కులు ఉంటాయి. ఒక్కో దిగ్గుక్కును ఒక్కో దేవత పరిపాలిస్తుంటారు. ఆ ప్రకారం
తూర్పు దిక్కుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఈయన సంతానం, ఐశ్వర్యాలను
కలిగిస్తాడు కనుక ఈ భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. ఈ దిక్కులో బావులు,
బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.
పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణ దేవుడు. తూర్పు దిక్కుకన్నా తక్కువ ఖాళీ
స్థలం విడిచిపెట్టి ఎత్తుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే సర్వశుభములు కలుగుతాయి.
పడమర భాగంలో మంచి నీటి బావులు, బోరులు నిర్మించుకోవచ్చు. అయితే ఇవి
విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ
విశాలంగానూ ఈ దిశ ఉండాలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు
ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
అలాగే దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశ ఖాళీ స్థలం కన్నా ఈ దిశలో
తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం
అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం,
అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
ఈశాన్య దిక్కకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగానూ
ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు... బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు
కలుగుతాయి. అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం
తెలియజేస్తోంది.
ఆగ్నేయానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు
చేసుకోవటం శుభం. బావులు, గోతులు... ఇతర దిశలకన్నా ఎక్కువ పల్లంగా
ఉంచటం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు,
అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటం జరుగుతుంది.
వాయవ్యానికి అధిష్టాన దేవత వాయువు. నైరుతి,ఆగ్నేయ దిశలకన్నా
పల్లంగానూ, ఈశాన్య దిక్కుకన్నా మిర్రుగానూ ఉండాలి. అదే
విధంగా ఈ దిశలో నూతులు,గోతులు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశ
ఈశాన్యం కన్నా హెచ్చుగా పెరిగి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పుత్ర సంతతికి హాని,
అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్న దిక్కులకన్నా ఈ
దిశ తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ఈ దిశలో ఎక్కువగా బరువులు
వేయటం శుభం. ఈ దిశలో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
అష్టదిక్పాలకులలో శుభకారకులు ఎవరు?
తూర్పు : క్షత్రియ సంభవుడు. దర్తంకీర్తి కారకుడు, రాజస గుణాధిక్యతగలవాడు ఇంద్రుడు.
పడమర : పాశంతో బంధించి, పురుషులకు
తక్కువ సామర్ధ్యమిచ్చవాడు వరుణుడు.
దక్షిణ :
మృత్యుకారకుడు. వినాశకుడు. దరిద్రకారుడు. సమవర్తి. ధన హీనుడు యముడు.
ఉత్తర : ఐశ్వర్య, భోగ
భాగ్యకారకుడు. సకల సంపత్కరుడు. ధనాధిపతి. కుబేరుడు.
ఈశాన్యం : ఈశాన్య దిక్పతి. మృత్యుంజయుడు, సకల శుభకారకుడు. వంశోద్దీపకుడు. శివుడు.
వాయువ్యం : అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే
గుణంగలవాడ వాయువు.
నైరుతి : నర వాహనుడు, రాక్షసుడు.
పీడా కారకుడు. రక్తపానమత్తుడు. హింసా కారకుడు. నైరుతి.
ఆగ్నేయం : దురహంకారి, సర్వదగ్ధ
సమర్ధుడు, ధన లేమి కారకుడు, రోగ
కారకుడు కూడా - అగ్ని.
---------------------
గోవులో
దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ
ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం
(ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త
భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ
రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి
ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని
శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా,
శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ...
బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం
దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల
నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద
అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త
రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల
అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు
కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే
శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న
సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ
విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక
ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని
పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని
పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు
ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు
ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో
పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను
పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని
పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల
గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.
----------------------------
భక్తి భావంలోని ఐదు సిద్ధాంతాలేంటో మీకు
తెలుసా!?
భక్తిని
పెంపొందించేందుకు, భక్తి మార్గాన్ని అవలంబించేందుకు ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి.
1. పరమేశ్వరుడే యావత్ ప్రపంచానికి ప్రభువు, అణువణువునా
వ్యాపించినా అనంతుడు ఈశ్వరుడే, మనిషి-పశువు అనే భేదం
లేకుండా ఈ చరాచర ప్రపంచమంతా ఆ మహా పవిత్రుడైన ఈశ్వర అద్భుతాలతో నిండి ఉంది.
2. సంపూర్ణుడైన పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులో సుఖము, సౌందర్యమే నిండి
ఉంది. ఈ విశ్వాసాన్ని మనస్సు అనుసరించినప్పుడు ప్రపంచం అతి సుందరంగా కనబడుతుంది.
3. భగవంతుడు ఏది అందిస్తే దానితో తృప్తి చెంది భగవంతుడికి
ఎల్లవేళలా కృతజ్ఞులుగా మెలగాలి. కష్టాలు, దుఃఖాలుగా భావించేదేది నిజమైన కష్టాలు కావు.
అవన్నీ మన మనస్సుని ఉన్నత స్థాయిలో ఉంచడానికే అనే సత్యాన్ని గ్రహించాలి.
4. మనస్సును బాధపెట్టడంకంటే మించిన పాపం లేదు. ఇతరుల
ప్రసన్నతను, సంతోషాన్ని సహించి పంచుకోవడమే పరమధర్మం.
5. నేను, నాది అనే అహం విడచి ఈ సమస్తం భగవంతుడిదే అనే భావాన్ని
పరిపూర్ణంగా పొందేందుకు సద్గురువును ఆశ్రయించాలి. తత్ఫలితంగా భగవంతునిలో ఐక్యమయ్యే
ఆదర్శ సూత్రాలు అలవడుతాయి.
బ్రహ్మజ్ఞానాయ నమోనమః
ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.
ప్రత్యేకముగా సాయినాథులవారు గురువారమును ఎంచుకోవటంలో అంతరార్థము ఏమిటి ?
తొలి అడుగు తమ జీవితాలకు అవసరమైన ఆర్థిక శక్తి సాధనకు, రెండవ అడుగు ఆరోగ్యకర ఆధ్యాత్మిక చింతనకు, మూడవ అడుగు ధర్మబద్ధ ఆర్థిక సంపాదన కొరకు, నాల్గవ అడుగు విజ్ఞాన సముపార్జనకు, ఆనంద, ప్రేమ, గౌరవాలకు, ఐదవ అడుగు సంతానం పొంది వారి బాధ్యత తీసుకుంటామని, ఆరవ అడుగు తమ చర్యలపై నియంత్రణ సాధనకు, ఏడవ అడుగు ఒకరికోసం మరొకరిగా కలకాలం బతుకుతామనే వేయిస్తారు.
మొత్తం జీవితానికి అవసరమయిన అంశాలన్నింటిని ఈ ఏడు అడుగుల్లోకి ఇమిడ్చి ప్రామాణికంగా రూపొందించడాన్నే సప్తపది అని అంటారు.
శివునికి చేసేదే అభిషేకం. మిగిలిన దేవీదేవతలకు మంత్రపూతంగా స్నానం చేయించడం జరుగుతుంది. ఆయా దేవతలకు చేసే పదహారు రకాల ఉపచారాలలో స్నానం కూడా ఒకటి.
ఆ ఆకులు సేవించటం ఆరోగ్య భాగ్యానికి హేతువు. తమలములు తమ జన్మలో ఒక్కసారైనా నమలని జన్మ బహుశావుండదని వేమనశతకంలో వివరించెను. జీర్ణశక్తి, ఎముకలపుష్టి, వీర్యవృధ్ధి, ఆకలి కలిగించుట, జఠరాగ్ని రగిలించుట, పైత్యం, అరుచి మొదలైన ఔషధాలన్నీ తమలపాకుల్లో ఉన్నాయి.
ఆంజనేయుని దేహము ఆకుపచ్చారంగులో నుండును - సుందరకాండలో వనములు తిరుగుచూ లంకాపురం చరించునప్పుడు అది రక్షణ కవచంగా కాపాడెను. కాబట్టి తమలపాకులతో స్వామిని అర్చిస్తే అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని పండితులు అంటున్నారు. ఇంకా శ్రీరామజయం అని రాసి తమలపాకులతో గానీ పేపర్లలో గానీ మాలగా సమర్పిస్తే వారు చెబుతున్నారు.
దీనికి కావలసింది పట్టుదల నిండిన హృదయం, అంకితభావం. కఠోరంగా పరిశ్రమిస్తే శబ్దాన్ని బట్టి ఆ వస్తువును ఛేదించే శబ్దవేది విద్యలోనూ నీవు గొప్ప విలుకాడు కాగలవు. అతి సున్నితమైన వస్తువులను సైతం ఛేదించాలంటే నీవు అతి తక్కువ కాంతితో సాధన చేస్తేనే పరిపూర్ణుడివి అవుతావు అని అనగానే అర్జునునికి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. అప్పటి నుంచి నిరంతరం పరిశ్రమించి తన విద్యలో అఖండమైన ప్రజ్ఞను సాధించి జగతిలోనే 'సవ్యసాచి'గా పేరుగాంచాడు.
అట్లే బ్రహ్మదేవుడు ఈ ప్రపంచంలోని సమస్త ప్రాణికోట్ల యొక్క భౌతిక స్వరూపాలను పంచభూతాలతోనే నిర్మించియున్నాడు. కనుకనే ప్రపంచంలోని ఏ వస్తువును విడదీసినా పంచభూతాలే కనబడతాయి. ప్రతి వస్తువు, ప్రతి శరీరము పృథివి జలాదులను పంచభూతాలతోనే ఏర్పడుటను బట్టి వాటిలో ఆసక్తిని రేకెత్తించే విషయము ఏమున్నది ఈ సత్యం తెలిస్తే ఇక మానవుడు విషయ భోగాల పైకి పరిగెత్తడు.
కనుకనే జ్ఞాని విషయాసక్తరహితుడై దృశ్యభోగాలవైపు పరుగిడక. దృష్టిని ఆత్మవైపుకు మరల్చి అదియే సారభూతమైందని గ్రహించి దాన్నే సేవిస్తూంటాడు. ధ్యానిస్తూంటాడు.
కాబట్టి జిజ్ఞాసులు, జన్మను తరింపజేసుకొనువారు పంచభూతమయము లందు విరక్తి కలిగి, ఆత్మ యందు అనురక్తి కలిగి, స్వస్వరూప సాక్షాత్కరానికి తీవ్రతర కృషి సలపాలి.
అయితే, ప్రతి రోజూ ఉదయం లేవగానే ఊరికే అనుకుని వదిలి వేయకూడదు. మనఃపూర్వకంగా అచరించే ప్రయత్నాలు సాగించాలి. దైనందిన కార్యకలాపాల్లో ఒత్తిళ్లు, ఆనందోళనలు ఉండటమన్నది సహజం. వాటిని అంతటితో వదిలేయాలని సలహా ఇస్తున్నారు. తమకు ఎదురయ్యే కష్టనష్టాలను తలచుకుంటూ కుంగిపోవడం కంటే.. వాటిని వదిలి వేసి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలని సలహా ఇస్తున్నారు.
భారతీయులందరూ పూజకై, ప్రార్ధనకై ఒక గదిని లేక కొంత స్థలాన్ని తమ గృహములలో కేటాయిస్తారు. ప్రతి రోజూ దైవానికి ముందు ఒక దీపాన్ని వెలిగిస్తారు. జపము, ధ్యానము, పారాయణము, ప్రార్ధనలు, భజనలు మొదలగు ఆధ్యాత్మిక సాధనాలు కూడా ఈ ప్రార్ధనా స్థలమందు జరుపుతారు. పుట్టిన రోజు, వివాహాది దినములు మరియు పండుగలు మొదలైన అన్ని శుభ సందర్భాలలో ప్రత్యేకమైన పూజలు చేస్తారు. గృహములోని పెద్దలు, పిన్నలు అందరు కూడా దైవముతో సాన్నిధ్యము కలిగి పూజ చేసికొంటారు.
పూజాగది - ఎందుకు?
ఈ చరాచర సృష్టికి పరమాత్మ మాత్రమే సొంత దారుడు. కావున మనము నివసించే గృహానికి కూడా నిజమైన హక్కుదారు పరమాత్మయే. పూజా గది అనేది ఆ యజమాని ఐన పరమాత్మ గది. మనము భగవంతుని సొత్తుకు నిజమైన సొంత దారులము కాము అనే భావన వలన మాత్రమె మన దురహంకారము, మనది అనే పెత్తందారి తనమును వదిలించుకోగలము.
మనము నివసించే గృహమునకు మరియు మనకు కూడా యజమాని భగవంతుడే. మనము కేవలము ఆయన గృహానికి నియమించబడ్డ నిమిత్త మాత్రులమైన సేవకులము అన్న సరైన భావన కల్గి ఉండటము ఉత్తమము. ఈ విధముగా భావించ వీలు కానిచో భగవంతుడిని మన గృహానికి విచ్చేసిన ముఖ్య అతిధిగా భావించి ఆయన సంతోషముగా ఉండడానికి పూజ గదిని కానీ, దైవ పీఠమును గాని వసతిగా కల్పించాలి. అన్ని వేళలా ఆ ప్రదేశం శుభ్రముగా మరియు అలంకార యుక్తంగా ఉండేలా చూడాలి (ఉన్నతాధికారి మన ఇంటికి వస్తుంటే వారికి చేసే సౌకర్యాలకన్నా కొంత ఎక్కువగానే ఉండేలా చూడాలి).
పరమాత్మ సర్వ వ్యాపి . ఈ విషయము గుర్తుంచు కోవడానికి ఆయన మన ఇంట్లో మనతో ఉండడానికి మనము పూజా గదులను కల్గి ఉండాలి. భగవంతుని అనుగ్రహము లేనిదే మనము ఎ పనిని విజయవంతముగా చేయలేము, దేనిని సాధించ లేము. పూజ గదిలో భగవంతుడిని ప్రతి రోజూ ప్రార్ధించటము వలన సన్నిహిత సంబంధము ఏర్పడి ఆయన అనుగ్రహాన్ని త్వరగా పొందగలము.
ఇంటిలోని ప్రతి గది ఒక ప్రత్యేకమైన పనికి నిర్దేశింపబడి ఉంటుంది. ఆయా గదులు ఆయా నిర్దేశింపబడిన పనులకు అనుకూలము కల్గి ఉండేలాగా అమర్చి ఉంటాయి. అదే విధముగా ధ్యానానికి, పూజకు, ప్రార్ధనకు కూడా అనుకూలమైన వాతావరణము కల్గినటువంటి పూజాగది మనకు అవసరము . పవిత్రమైన ఆలోచనలు, శబ్దతరంగాలు ఆ ప్రదేశములో వ్యాపించి అక్కడకు వచ్చినవారి మనస్సుల్ని ప్రభావితము చేస్తాయి . మనము అలసిపోయినప్పుడు లేక కలత చెందినప్పుడు కేవలము ప్రార్ధనా గదిలో కొద్దిసేపు కళ్ళు మూసుకుని కూర్చుంటే కూడా చాలు ప్రశాంతత, ఉత్సాహము, ఆధ్యాత్మిక ఎదుగుదల పొందగలము.
(అంతే కాని చేసే కొన్ని విధాలైన పనులు భగవంతుని ముందర చేయటానికి Guilty గా ఉంటుంది కదండీ అందుకు కాస్త దూరంగా ప్రత్యేక గది కట్టి అందులో భగవంతుణ్ణి బంధించేశాము అని మాత్రము దయచేసి అనకండి.)
నమస్తే ఎందుకు చెప్పాలి?
భారతీయులు ఒకరినొకరు 'నమస్తే' అని పలకరించు కుంటారు. నమస్తే అన్నప్పుడు తల వంచి రెండు అరచేతులు హృదయం ముందర కలపడము జరుగుతుంది. మనకన్నా చిన్నవారైనా, సమ వయస్కులైనా, పెద్దవారైనా స్నేహితులైనా మరియు కొత్తవారైనా కూడా ఇదే విధముగా నమస్తే అని పలకరించాలి.
శాస్త్రాలలో సంప్రదాయ బద్ధమైన ఐదు రకాల అభివందనములు ఉన్నాయి. అందులో నమస్కారము ఒకటి. నమస్కారము అంటే సాగిలపడుట అనే అర్ధము వస్తుంది. కానీ నమస్తే అంటే ఈ రోజుల్లో మనము ఒకరిని ఒకరు కలిసినప్పుడు ఇచ్చి పుచ్చుకునే మర్యాదగా గ్రహించాలి.
నమస్తే ఎందుకు చేయాలి?
నమస్తే అనేటటువంటిది మామూలుగా అలవాటుగా చేసేటటువంటి వందనమో, సంప్రదాయబద్ధమైన ఆచారమో లేక భగవదారాధనో అయి ఉండవచ్చును. ఏది ఏమైనప్పటికీ ఈ ఆచారములో మనకు తెలియని చాలా లోతైన అర్ధము ఉంది . సంస్కృతములో నమః+తే = నమస్తే. దీని అర్ధము - నేను నీకు నమస్కరిస్తున్నాను అని. నమః అనే పదాన్ని "న", "మః" గా విడదీయవచ్చు - నాది కాదు అనే అర్ధము వస్తుంది. ఇతరుల సన్నిధిలో మన అహంకారాన్ని వదిలించుకొనే లేక తగ్గించుకొనే ఆధ్యాత్మిక సాధనను తెలియ జేసే ఆచారమిది.
వ్యక్తుల మధ్య నిజమైన కలయిక అంటే వారి మనస్సులు కలవడమే. అందుకే మనము ఇతరులను కలిసినప్పుడు నమస్తే అంటాము. అనగా 'మన మనసులు కలియుగాక' అని అర్ధము. హృదయం ముందర రెండు అరచేతులు కలపడము ఈ అర్థాన్నే సూచిస్తుంది. తల వంచడము అనేది ప్రేమతో వినయముగా మర్యాదని, స్నేహాన్ని అందించడాన్ని తెలియచేస్తుంది.
నమస్కారమనేది ఆధ్యాత్మ పరంగా ఇంకా లోతైన అర్ధాన్ని సూచిస్తుంది . ప్రాణ శక్తి, దివ్యత్వము; ఆత్మ లేక పరమాత్మ అందరిలో ఒకేలాగా ఉన్నది. ఈ ఏకత్వాన్ని గుర్తించి రెండు చేతులు కలిపి తల వంచి ఇతరులను కలిసినప్పుడు వారిలో ఉన్న దివ్యత్వానికి నమస్కరిస్తాము. మహాత్ములకు, భగవంతుడికి నమస్కారము చేసేటప్పుడు అందుకనే ఒక్కోసారి మనలోనున్న దివ్యత్వాన్ని చూసుకోవడానికా అన్నట్లు కనులు మూసుకొంటాము. దివ్యత్వాన్ని సూచించే విధముగా నమస్కారము ఒక్కోసారి భగవన్నామములతో ద్వారా కూడా చేయ బడుతుంది. ఈ ప్రాముఖ్యత తెలిసికొన్నప్పుడు నమస్కారము చేసేటప్పుడు పైపైకే నమస్తే అనడము గాక సరైనటువంటి స్నేహానికి దోహదము చేసే లాగున ప్రేమతోను గౌరవముతోను కూడిన వాతావరణాన్ని కలుగ చేయ గలము.
తల్లిదండ్రులకు, పెద్దలకు సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
భారతీయులు తమ తల్లిదండ్రులకు, పెద్దలకు, గురువులకు, మహాత్ములకు సాష్టాంగ నమస్కారము చేస్తారు. మనచే నమస్కరింపబడిన పెద్దలు తిరిగి వారి చేయిని మన తలమీద లేక పైన ఉంచి దీవిస్తారు. ప్రతి రోజు పెద్దలను కలిసినప్పుడు మరియు ఏదైనా క్రొత్తగా ప్రారంభించేటప్పుడు, జన్మదినములు పండుగలు మొదలగు శుభ సందర్భాలలో కూడా పెద్దలకు నమస్కరించడము జరుగుతుంది. కొన్ని సంప్రదాయ సమూహాలలో తమ కుటుంబము, సామాజిక హోదా మరియు తమ పరిచయము తెలియచేసే విధముగా (ప్రవర తో కూడి) సాష్టాంగ నమస్కారము చేయబడుతుంది.
సాష్టాంగ నమస్కారము ఎందుకు చేయాలి?
మానవుడు తన పాదాల ఆధారముగా నిలబడతాడు. సాష్టాంగ నమస్కారములో పెద్దల పాదాలకు నమస్కరించడమనేది వారి వ్యక్తిత్వానికి ఆధారమైన పెద్దరికానికి, పూర్ణత్వానికి, ఉదారతకు, దివ్యత్వానికి మనము ఇచ్చేటటువంటి గౌరవానికి చిహ్నము. ఇది వారికి మనపై గల స్వార్ధరహిత ప్రేమ మరియు మన సంక్షేమానికి వారు చేసిన త్యాగాల పట్ల మన కృతజ్ఞతని తెలియజేస్తుంది. ఇది ఇతరుల గొప్పతనాన్ని అణకువతో అంగీకరించే ఒక మార్గము. భారతదేశము యొక్క గొప్ప శక్తులలో ఒకటైన పటిష్టమైన కుటుంబ బాంధవ్య వ్యవస్థను ప్రతిబింబింప జేసే ఆచారములలో ఇది ఒకటి.
భారత దేశములో పెద్దల శుభ సంకల్పాలకు మరియు అశీర్వాదములకు ఉన్నతమైన విలువ ఇవ్వబడుతుంది. వాటిని పొందడానికి మనము నమస్కరిస్తాము. మంచి ఆలోచనలు మంచి తరంగాలను సృష్టిస్తాయి. పరిపూర్ణమైన ప్రేమ, దివ్యత్వము మరియు ఉదారత్వముతో నిండిన హ్రుదయాలనుండి ఉద్భవించే శుభకామనలు అద్భుతమైన శక్తిని కల్గి ఉంటాయి. ఎప్పుడైతే మనము వినయముతో గౌరవముతో పెద్దలకు నమస్కరిస్తామో అప్పుడు వారి శుభకామనలు, దీవెనలు మంచి శక్తి వంతమైన తరంగ రూపంలో మనపై ప్రసరిస్తాయి. ఇందు వలననే మనము నిలబడి కానీ, సాగిలబడి కానీ నమస్కారము చేసినప్పుడు శరీరమంతా ఈ శక్తిని స్వీకరించ గలుగుతుంది.
గౌరవాన్ని తెలియపరచే వివిధ రీతులు:
గౌరవాన్ని తెలియపరచే వివిధ రీతులు:
ప్రతుత్థానము : లేచి నిలబడి స్వాగతమిచ్చుట
నమస్కారము : నమస్తే అని విధేయతను వ్యక్త పరచడము
ఉపసంగ్రహణ : పెద్దల, గురువుల పాదాలను తాకడము
సాష్టాంగము : కాళ్ళు, మోకాళ్ళు, ఉదరము, చాతి, నుదురు చేతులు అన్నీ నేలను తాకేలాగా పెద్దల ముందు సాగిలబడి నమస్కరించుట
ప్రత్యభివందనము: ప్రతి నమస్కారము చేయుట.
సంపద, వంశము, వయస్సు, నైతిక బలము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము ఒకదాని కంటే ఒకటి ఎక్కువ గా వ్యక్తులకు గౌరవాన్ని పొందే అర్హతను కల్గిస్తాయి. ఇందువలననే భూమిని పరిపాలించే రాజు ఐనప్పటికీ ఆధ్యాత్మిక గురువు యొక్క పాదాలకు నమస్కరిస్తాడు. ఈ భావాన్ని ప్రత్యేకంగా స్పష్టము చేసే కధలెన్నో మనకు రామాయణం, మహా భారతము వంటి ఇతిహాసాలలో గలవు.
ఈ సంప్రదాయము వలన కుటుంబము మరియు సంఘము లోని వ్యక్తుల మధ్య పరస్పర ప్రేమ, గౌరవము, ఐకమత్యం, శాంతియుత వాతావరణము పెంపొందించ బడుతున్నాయి.
నుదుట బొట్టు పెట్టుకొంటాము. ఎందుకు?
దైవభక్తి గల భారతీయులు ప్రత్యేకించి వివాహితులు ఐన స్త్రీలు నుదిటి మీద తిలకము లేదా బొట్టు పెట్టుకొంటారు. ప్రతి రోజు స్నానము చేసిన తరువాత మరియు ప్రత్యేక సందర్భాలలోనూ, పూజ చేసే ముందర, తరువాత, లేక దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు తప్పక బొట్టు పెట్టుకుంటారు. చాలా తెగలలో వివాహితులైన స్త్రీలు ఎల్లా వేళలా నుదుట కుంకుమ పెట్టుకొనే కనిపించాలనే ఆదేశము ఉంది. వైదిక పద్దతులను ఆచరించే వారు మంత్ర ప్రార్ధనలతో కుంకుమ ధరిస్తారు. మహాత్ములకు మరియు దైవ ప్రతిమలకు ఆరాధనా సూచకంగా బొట్టు / తిలకం ధారణ జరుపుతాము. తిలకము వేరు వేరు రంగులలోను, రూపాలలోను ఉంటుంది.
నుదిటి పైన బొట్టు ఎందుకు?
నుదుటి పైన బొట్టు - ధరించిన వారిలోనూ, ఎదుటి వారిలోనూ పవిత్ర భావనను కలుగ చేస్తుంది. దైవ చిహ్నము గా గుర్తించ బడుతుంది. మునుపటి కాలములో బ్రాహ్మణ క్షత్రియ, వైశ్య, శూద్రులు వేరు వేరు చిహ్నాలను ధరించేవారు. పౌరోహిత్యము లేక శాస్త్ర సంబంధమైన వృత్తిని కలిగిన బ్రాహ్మణుడు తన స్వభావమైన పవిత్రతకు చిహ్నంగా తెల్లని చందనాన్ని ధరించేవాడు. క్షత్రియ వంశానికి చెందిన క్షత్రియుడు తన వీరత్వానికి చిహ్నంగా ఎర్రని కుంకుమను నుదుట ధరించే వాడు. వర్తక వాణిజ్యాల ద్వారా సంపదను పెంపొందించే వైశ్యుడు అభ్యుదయానికి అభివృద్ధికి చిహ్నంగా పసుపు పచ్చని కేసరిని ధరించేవాడు. శూద్రుడు నల్లని భస్మాన్ని లేక కస్తూరిని ధరించెవాడు.
విష్ణు ఉపాసకులు U ఆకారముగా చందన తిలకాన్నీ, శైవ ఉపాసకులు భస్మ త్రిపున్డ్రాన్నీ, దేవీ భక్తులు ఎర్రని కుంకుమ బొట్టును ధరించేవారు. భగవంతునికి సమర్పించిన చందనము, కుంకుమ, భస్మము ప్రసాదముగా స్వీకరించబడిన తరువాత మన నుదుట పెట్టబడుతుంది. జ్ఞాపక శక్తికి మరియు ఆలోచనా శక్తికి స్థానమైన కనుబొమ్మల మధ్య నున్న ప్రదేశములో తిలకము పెడతాము. యోగ పరిభాషలో ఈ ప్రదేశము ఆజ్ఞా చక్రముగా చెప్పబడుతుంది. నేను భగవంతుని గుర్తున్చుకొండును గాక! ఈ భక్తీ భావన నా అన్ని కార్య కలాపాలలోనూ వ్యాపించుగాక! నేను నా అన్ని వ్యవహారాలలో ధర్మబద్ధముగా ఉందును గాక! అనే ప్రార్ధనతో తిలకము పెట్టుకోబడుతుంది. మనము ఈ ప్రార్ధనాయుతమైన వైఖరిని తాత్కాలికముగా మరచిపోయినా, ఇతరుల నుదుటి పైనున్న బొట్టు మనకు వెంటనే మన ప్రార్ధనను గుర్తుకు చేస్తుంది. అందుకే ఈ తిలకము మనకు భగవంతుని ఆశీర్వాదము మరియు అధర్మ ప్రవ్రుత్తులనుంచి, వ్యతిరేక శక్తుల నుండి రక్షణ వంటిది.
మన శరీరము మొత్తము ప్రత్యేకించి నుదురు కనుబొమ్మల మధ్యనున్న సూక్ష్మమైన స్థానము విద్యుదయస్కాంత తరంగ రూపాలలో శక్తిని వెలువరిస్తుంది. అందువలననే విచారముగా నున్నప్పుడు వేడి కలిగి తలనొప్పి వస్తుంది. తిలకము లేక బొట్టు మన నుదిటిని చల్లబరచి వేడి నుండి రక్షణ నిస్తుంది. శక్తిని కోల్పోకుండా మనల్ని కాపాడుతుంది. కొన్ని సమయాలలో చందనము లేక భస్మము నుదుట మొత్తము పూయబడుతుంది. బొట్టుకు బదులుగా వాడే ప్లాస్టిక్ బిందీ లు అలంకార ప్రాయమే కానీ నిజమైన ప్రయోజనాన్ని కలిగించవు.
భారతీయులకు ఈ ఆచారము చాలా అపూర్వమైనది. మరియు ఎక్కడ ఉన్నా సులభంగా మనల్ని గుర్తించడానికి సహాయపడుతుంది.
కాగితాలను పుస్తకాలను, మనుషులను కాళ్ళతో తగలకూడదు ఎందుకు?
హిందువుల ఇళ్ళల్లో, చిన్నప్పటినుంచీ కాగితాలకి, పుస్తకాలకి మరియు మనుషులకి కాళ్ళను తగలనివ్వ కూడదని నేర్పించబడుతుంది. ఒకవేళ పొరబాటున కాగితాలకి, పుస్తకాలకి, సంగీత సాధనాలకి లేదా ఏ ఇతరమైన విద్యా సంబంధమైన వస్తువులకి కాలు తగిలితే క్షమాపణకి గుర్తుగా కాలు తగిలిన వస్తువుని గౌరవపూర్వకముగా చేతితో తాకి కళ్ళకద్దుకోవాలని పిల్లలకు నేర్పబడుతుంది.
కాగితాలకు, మనుషులకు కాళ్ళు ఎందుకు తగలరాదు?
భారతీయులకు జ్ఞానము పవిత్రము, దివ్యము ఐనది. అందువలననే దానికి ఎల్లవేళలా గౌరవమివ్వాలి. ఈ రోజుల్లో పాఠ్యంశములను ఆధ్యాత్మికము ఐహికము అని విడదీస్తున్నాము. కానీ ప్రాచీన భారతదేశములో ప్రతి విషయము శాస్త్ర సంబంధమైన లేక ఆధ్యాత్మ సంబంధమైనది అయినా సరే పవిత్రంగా పరిగణించి గురువుల చేత గురుకులాల్లో నేర్పించబడేది.
చదువుకి సంబంధించిన వస్తువులని తొక్క కూడదనే ఆచారము భారతీయ సంస్కృతి విద్యకు ఇచ్చే ఉన్నత స్థానాన్ని తరచూ గుర్తు చేస్తుంది. చిన్న తనమునుంచే ఈ విధముగా నేర్పడము వలన మనలో పుస్తకాల పట్ల, విద్య పట్ల శ్రద్దాభక్తులు నాటుకు పోతాయి. జ్ఞానాధి దేవతకు అర్పణగా సంవత్సరానికి ఒకసారి సరస్వతీ పూజ లేదా ఆయుధపూజ రోజున మనము పుస్తకాలని వాహనాలని మరియు పనిముట్లని పూజించడానికి కూడా ఇది ఒక కారణము. మనము చదువుకునే ముందు ఈ క్రింది విధంగా ప్రార్థిస్తాము .......
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా
వరాలనిచ్చి, కోరికలని తీర్చే ఓ సరస్వతీ దేవీ! నా చదువును ఆరంభించే ముందర నీకు నమస్కారము చేస్తున్నాను. నీవు ఎల్లప్పుడూ నా కోరికలు తీర్చుదువు గాక!
పిల్లలు పొరపాటున ఎవరికయినా కాళ్ళు తగిలినప్పుడు చాల భయపడతారు. ఒకవేళ పొరపాటున తగిలితే క్షమాపణకై మనము ఆ వ్యక్తిని చేతితో తాకి వేళ్ళను కళ్ళకు అద్దుకోవాలి. పెద్దవాళ్ళయినా చిన్నవాళ్ళని అజాగ్రత్తతో కాళ్ళతో తగిలితే, వారు వెంటనే క్షమాపణ చెప్తారు.
ఇతరులకి కాళ్ళు తాకడము చెడునడవడిగా పరిగణింప బడుతుంది - ఎందుకు?
మానవుడు ఈ భూమి మీద ప్రాణముతో, భగవంతుని యొక్క చక్కటి ఆలయముగా పరిగణింప బడుతాడు. అందువల్ల ఇతరులను పాదాలతో తాకడము అంటే వారిలో నున్న దివ్యత్వాన్ని అగౌరపరచడం వంటిదే. అందుకే పొరపాటున తగిలినా కూడా వెంటనే భక్తీ, వినయములతో కూడిన క్షమాపణను చెప్పాలి.
పై విధముగా మన ఆచారములు చాల సరళమైనవి. కానీ అవి చాలా శక్తివంతమైన పరిపూర్ణమైన ఆధ్యాత్మిక సత్యాలను గుర్తుకు తెస్తాయి. ఇటువంటి ఆచారాలు శతాబ్దాలనుండి భారతీయ సంస్కృతిని సజీవముగా నిలబెట్టడానికి కారణమయ్యాయి.
విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?
నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు. విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసికొంటారు.
విభూతిని ఎందుకు ధరించాలి?
భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము. "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము. హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది. నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది. మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది. శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది. అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు. మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు. ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది. అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు. కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము.
శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు. మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.
కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద. దానికి నాశనము లేదు. అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె.
"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
మనల్ని పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము. అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును గాక.
ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము ఎందుకు?
పాశ్చాత్య సాంప్రదాయములో క్రుతజ్ఞతా పరమైన ప్రార్ధన తరువాత తీసికోబడుతుంది. భారతీయులు దానిని భగవంతునికి నివేదన చేసిన తరువాత 'ప్రసాదం' గా స్వీకరిస్తారు. దేవాలయాలలో మరియు అనేకుల గృహాల్లోను ప్రతిరోజూ వండిన పరార్ధాలు ముందుగా భగవంతునికి నివేదిన్చబడతాయి. ఆ నివేదింపబడిన పదార్ధము మిగతా పదార్ధాలతో కలిపి ప్రసాదంగా వడ్డించ బడుతుంది. మన నిత్య పూజా కార్యక్రమంలో కూడా మనము భగవంతునికి 'నైవేద్యము' సమర్పిస్తాము.
మనము నైవేద్యము ఎందుకు సమర్పిస్తాము ?
భగవంతుడు సర్వ శక్తి వంతుడు మరియు సర్వజ్ఞుడు. భగవంతుడు పూర్ణుడయి ఉండగా మానవుడు అందులో అంశ మాత్రమె. మనము ఏ పనైనా భగవంతుడిచ్చిన శక్తి, జ్ఞానము వలన మాత్రమే చేయగలుగుతున్నాము. కావున జీవితములో మనం చేసే కర్మల ఫలితంగా మనము పొందేదంతా నిజానికి ఆయనదే. ఈ విషయము గ్రహించి ఆహారాన్ని ఆయనకు నైవేద్యంగా సమర్పిస్తాము. భగవంతునికి అర్పించిన తర్వాత అది ఆయన దివ్య స్పర్శ నొంది అనుగ్రహంతో మనకిచ్చిన కానుకగా మనచే స్వీకరించ బడుతుంది.
ఈ విషయం తెలిసికొన్న తరువాత ఆహారం పట్ల, ఆహారం తినే విదానంపట్ల మన వైఖరి పూర్తిగా మారుతుంది. సాధారణంగా నివేదిమ్పబడిన ఆహారము పవిత్రంగాను, ఉత్తమమైనది గాను ఉంటుంది. మనము దానిని స్వీకరించే ముందర ఇతరులతో పంచుకొంటాము. మనము ఆహారాన్ని అధికార పూర్వకముగా అడగకూడదు. అసంతృప్తి పడకూడదు లేక మనకు లభించిన ఆహారపు నాణ్యత గురించి విమర్శించ కూడదు. మనము దానిని సంతోషముగా ప్రసాద బుద్ధితో స్వీకరించాలి. ఈ విధముగా ప్రసాద భావన పెంపొందింప చేసుకొంటే కేవలము ఆహారము పట్లనే కాక మన జీవితములో లభించే అన్నింటిని కూడా ప్రసాదంగా సంతోషముగా స్వీకరించగలము.
ప్రతిరోజు భోజనాన్ని ముందర పవిత్రము చేసే చర్యగా కంచం చుట్టూ నీరు చల్లుతాము. కంచం ప్రక్కగా ఐదు ముద్దలను మనచేత చెల్లించబడే రుణాలకి ప్రతీకగా ఉంచుతాము.
1) దేవ ఋణం : దేవతల దయార్ద్ర అనుగ్రహము మరియు రక్షణలకు.
2) పిత్రు ఋణం : పితృ దేవతలకి వంశ పారంపర్యత్వాన్ని మరియు సంస్కృతిని ఇచ్చినందుకు.
2) భూత ఋణం : ఎవరి ఆలంబన లేనిదే ఈ సంఘములో మనము జీవిన్చాలేమో ఆ సంఘాన్ని ఏర్పరిచిన వారు.
3) రుషి ఋణం : మన మతమును మరియు సంస్కృతిని గుర్తింపచేసి, వృద్ధి పరచి, తద్వారా మనకందించినందుకు
4) మనుష్య ఋణం .. ఇతర ప్రాణులు స్వలాభాపేక్ష లేకుండా మనల్ని సేవిస్తున్నందుకు
ఆ తర్వాత పంచ ప్రాణాలుగా శరీరాన్ని నిలబెట్టే ప్రాణ శక్తిగా మనలో ఉన్న భగవంతుడికి ప్రాణాయా స్వాహా; అపానాయ స్వాహా; వ్యానాయ స్వాహా; ఉదానాయ స్వాహా; సమానాయ స్వాహా అని చెపుతూ నివేదించ బడుతుంది. పంచ ప్రాణాలు ఈ క్రింది విధముగా శారీరక విధులు నిర్వహిస్తాయి.
1) ప్రాణము ... శ్వాస కొశమును చైతన్య వంతము గావిస్తుంది.
2) వ్యానము ... నాడీ వ్యవస్థను నియంత్రింప చేస్తుంది
3) అపానము ... వ్యర్ధ పరార్ధాలను బయటకు త్రోస్తుంది.
4) సమానము ... జీర్ణ క్రియను చైతన్య వంతము చేసి శరీరానికంతటికి శక్తి సరఫరా చేస్తుంది.
5) ఉదానము ... ఎక్కిళ్ళు మొదలగునవి కల్గించేది, ఆలోచనా శక్తి నిచ్చేది. పై విధంగా నివేదించబడిన తరువాత ఆహారం ప్రసాదంగా తీసికోబడుతుంది. ఈ భావన గుర్తు చేసి కోవడానికి భగవద్గీత లోని ఈ శ్లోకాలను చదువుతారు.
బ్రహ్మార్పణం బ్రహ్మ హవి: బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం
బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా
కర్మనే బ్రహ్మమని స్థిరంగా భావించి బ్రహ్మమనే హవిస్సు బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మముచేత హోమం చేయబడేది బ్రహ్మమే. దానిద్వారా అందుకోవలసిన గమ్యం కూడా బ్రహ్మమే.
అహం వైశ్వానరోభూత్వా ప్రాణినాం దేహమాశ్రితః
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం
నేను వైశ్వానరుడినై ప్రాణుల దేహాలను ఆశ్రయించి ప్రాణాపానములతో కూడికొని చతుర్విధ అన్నాన్ని పచనము చేస్తున్నాను.
ప్రదక్షిణము చేస్తాము - ఎందుకు?
మనము దేవాలయాన్ని దర్శించినప్పుడు ప్రార్ధన, పూజ అనంతరము గర్భాలయము చుట్టూ కుడి చేతి వేపుగా తిరగడమే ప్రదక్షిణ.
ప్రదక్షిణము ఎందుకు చేస్తాము?
ఒక కేంద్ర బిందువు లేనిదే మనము ఒక వృత్తాన్ని చిత్రీకరించలేము. భగవంతుడు మన జీవితాలకు కేంద్రము, ఆధారము మరియు సారము. మనము ఆయనను కేంద్రముగా చేసికొని మన జీవిత కార్య కలాపాలు సాగిస్తాము. ఈ ప్రాముఖ్యతను తెలిపేదే ప్రదక్షిణము.
ఒక వృత్తానికి దాని పరిధి లోని ప్రతి బిందువు కేంద్ర స్థానము నుంచీ సమానమైన దూరంలోనే ఉంటుంది. అనగా మనమెక్కడ ఉన్నప్పటికీ, ఎవరమయినప్పటికీ, భగవంతునికి అందరమూ సమానమైన సన్నిహితులమే. పక్షపాత రహితముగా ఆయన కరుణ అందరి వైపు ఒకేలాగా ప్రవహిస్తూ ఉంటుంది.
ప్రదక్షిణ ఎడమ నుండి కుడికి గుండ్రగానే ఎందుకు చేయబడుతుంది?
ప్రదక్షిణ చేసేటప్పుడు భగవంతుడు మనకు కుడివైపు ఉంటాడు. అందుకని కుడి వైపు నుంచి ప్రదక్షిణము చేస్తాము. భారత దేశములో కుడి వైపు అనేది శుభ ప్రదత ను తెలుపుతుంది. ఆంగ్ల భాషలో కూడా సరైన, సరికాని అని చెప్పడానికి రైట్ సైడ్ / రాంగ్ సైడ్ అనే పదాలు వాడతారు. అందువలన గర్భాలయంను కుడి వైపుగా ఉంచి ప్రదక్షిణము చేసేటప్పుడు మనకు అన్ని వేళలా సహాయము, శక్తిని ఇచ్చి, మార్గ దర్శకత్వము అయి మన జీవితాన్ని ధర్మము వైపు నడిపించే వాడయిన భగవంతునితో బాటు ఋజు వర్తనము కలిగి శుభప్రదమైన జీవితాన్ని గడపాలని గుర్తు చేసికోవాలి. మనము అత్యంత ప్రాముఖ్యం ఇచ్చే వాటిని కుడి వైపున అంత కన్నా తక్కువ ప్రాధ్యాన్యత ఇచ్చే వాటిని వెడమ వైపున ఉంచడము మన సాంప్రదాయం. ఈ విధముగా చేయడము వలన అధర్మ ప్రవృత్తుల నుంచి బయట పడి మళ్ళీ మళ్ళీ తప్పులు చేయకుండా సవ్య మార్గములో నిలబడతాము.
భారతీయ వేద గ్రంధాలు మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిధి దేవో భవ అని శాసిస్తాయి. నువ్వు నీ తల్లిదండ్రులను మరియు గురువులని భగవత్స్వరూపులుగా భావించుదువు గాక! ఈ భావముతో మనము మన తల్లి దండ్రులకు మరియు మహాత్ములకి కూడా ప్రదక్షిణ చేస్తాము. తన తల్లి దండ్రులకి గణపతి దేవుడు ప్రదక్షిణ చేసినట్లు చెప్పే కధ అందరికీ తెలిసినదే.
సంప్రదాయ పద్దతి ప్రకారము పూజ పూర్తి చేసిన తరువాత మనము విధిగా ఆత్మ ప్రదక్షిణ చేస్తాము. ఈ విధముగా చేయడము వలన బాహ్యముగా విగ్రహ రూపంలో ఉన్న భగవంతుడే మనలో ఉన్న విశిష్టమైన దివ్యత్వముగా గుర్తిస్తాము. మనము ప్రదక్షిణ చేసేటప్పుడు ఈ క్రింది విధంగా స్తుతిస్తాము.
యానికానిచ పాపాని జన్మాంతర కృతాని చ
తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే
ఎన్నో జన్మలుగా చేయబడిన పాపాలన్నీ ప్రదక్షిణలో వేసే ప్రతి అడుగులోనూ నశింపబడు గాక!
మొక్కలని, చెట్లని పవిత్రముగా భావిస్తాము ఎందుకు?
ప్రాచీన కాలము నుంచీ భారతీయులు మొక్కలనీ వృక్షాలనీ పవిత్ర భావన తో పూజిస్తున్నారు. ఆయా ప్రదేశము లందలి వృక్ష, జంతు స్థావరాలన్నింటినీ పవిత్ర భావనతో గౌరవిస్తున్నారు. ఇది ఒక మూఢ ఆచారము లేక అనాగరిక చర్య కాదు. ఇది భారత సంస్కృతి యొక్క జ్ఞానాన్ని, దూరదృష్టిని మరియు మంచి సంస్కారాన్ని తెలియ పరుస్తున్నది. పురాతన భారతీయులు ప్రకృతి మాతను పూజించారు. ఆధునిక మానవుడు ప్రకృతిని వశపరచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
మనము మొక్కలనీ, వృక్షాలనీ ఎందుకు పవిత్రంగా భావిస్తాము?
మనలో జీవ శక్తి గా ఉన్న భగవంతుడే మొక్కలు, జంతువులు మొదలైన అన్ని ప్రాణులలోను వ్యాపించి ఉన్నాడు. అందువలననే మొక్కలైనప్పటికీ, జంతువులైనప్పటికీ వాటి నన్నింటినీ పవిత్రమైనవి గా పరిగణిస్తాము. ఈ భూమి మీద మానవుడి జీవితము మొక్కలపై మరియు వృక్షాలపై ఆధారపడి ఉంది. అవి మన మనుగడకు అవసరమైన ఆహారము, ప్రాణ వాయువు, వస్త్రాలు, వసతి, ఔషధాలు మొదలైన ప్రాణాధార వనరులను అందిస్తున్నాయి. మన పరిసరాలకు సుందరత్వాన్ని కలిగిస్తున్నాయి. ఏమీ ఆశించకుండా మానవుడికి సేవచేస్తూ మనము జీవించడానికి వాటి జీవితాల్ని అర్పిస్తున్నాయి. త్యాగానికి ఉదాహరణగా నిలబడి ఉన్నాయి. ఫలభరితమైన చెట్టు పైకి రాయి విసిరితే ఆ చెట్టు బదులుగా ఫలాన్ని ఇస్తున్నది.
నిజానికి భూమి మీద మానవుడికన్నా ముందే వృక్ష జంతు సమూహాలు నివసించేయి. ప్రస్తుతము వాటి పట్ల మానవుని కఠిన వైఖరి వలన వన్య ప్రాంతాలు నాశనము చేయడము వలన ఎన్నో రకాల వృక్షజాతిని నశింప చేయడము వలన ప్రపంచము తీవ్రమైన భయాన్దోళనలకు గురి అగుచున్నది. మనము వేటికి విలువ ఇస్తామో వాటినే రక్షించుకొంటాము. అందుకే భారత దేశములో మొక్కలను వృక్షాలను పవిత్రమైనవిగా గౌరవించడము చిన్నప్పట్నుంచే నేర్పబడుతుంది. అప్పుడే స్వతహాగా వాటిని మనము రక్షించుకొంటాము.
ఏ కారణముచేతనైనా ఒక చెట్టును నరుక వలసివస్తే పది చెట్లను నాటాలని భారతీయ పవిత్ర గ్రంధాలు చెప్తున్నాయి. మనకు ఆహారము, వంటచెరకు వసతి మొదలైన వాటికి అవసరమైనంత వరకు మాత్రమే మొక్కల వృక్షాల భాగాలను వాడుకోవాలని చెప్పబడింది. అంతే కాకుండా చెట్టును నరికిన పాపము రాకుండా ఉండాలంటే ఒక మొక్కను లేక చెట్టును కోయబోయే ముందు క్షమాపణ అడగవలసిందిగా కూడా చెప్పబడుతున్నది. మొక్కలు, వృక్షాలు చేసే త్యాగ సేవల గురించి మరియు వాటిని పోషించవలసిన మన బాధ్యత గురించిన కథలు చిన్నతనము నుంచే చెప్ప బడతాయి. అద్భుతమైన ప్రయోజనకర గుణాలు కల్గిన తులసి, రావి మొదలైన మొక్కలు, వృక్షాలు నేటికీ పూజింప బడుతున్నాయి. దేవతలు మొక్కలు మరియు వృక్షాల రూపములో ఉన్నారనే నమ్మకము వలన అనేకులు వారి కోరికలను తీర్చుకొనుటకు మరియు భగవంతుడిని సంతోష పరచుటకు వాటిని పూజిస్తారు.
ఉపవాసం ఎందుకు చేయాలి?
భక్తి శ్రద్దలు గల అత్యధిక పక్ష భారతీయులు ఒక క్రమ పద్దతిలో లేదా పండుగల వంటి ప్రత్యెక సందర్భాలలో ఉపవాసాన్ని పాటిస్తారు. అటువంటి రోజుల్లో వాళ్ళు ఏమీ తినకుండా లేక ఒక్కసారి తినడం లేదా పండ్లు లేక అల్పాహారమును ఆహారముగా తీసికొని ఉపవాసము ఉంటారు. కొందరు రోజంతా కనీసం మంచి నీళ్ళు అయినా త్రాగకుండా కఠిన మైన ఉపవాసము చేస్తారు. ఉపవాసం ఎన్నో కారణాల కోసం చేయబడుతుంది. భగవంతుని కోసం లేక సంయమనం కోసం, అసమ్మతిని తెలియ పరచడానికి కూడా ఉపవాసం చేస్తారు. గాంధీ గారు బ్రిటిష్ పరిపాలనకు వ్యతిరేకంగా అసమ్మతిని తెలియపరచడానికి ఉపవాసం చేసారు.
ఉపవాసం ఎందుకు చేస్తాము?
ఆహారాన్ని పొదుపు చేయడానికా లేక ఆకలిని బాగా పెంచుకుని విందు ఆరగించాదానికా? నిజానికి అందుకు కాదు. మరి మనమెందుకు ఉపవాసం చేస్తాము?
సంస్కృతంలో ఉప అంటే 'దగ్గరగా' + వాస అంటే 'ఉండడం' అని అర్ధము. కాబట్టి ఉపవాసము అంటే దగ్గరా (ఆ భగవంతుడి) ఉండడం అంటే భగవంతునితో సన్నిహిత మానసిక సామీప్యతను సంపాదించడం. మరి ఉపవాసం - ఆహారముల మధ్య ఏమిటి సంబంధము?
కొన్ని రకాల ఆహారము మన బుద్ధిని మందకొడి గాను మరియు మనసులో అలజడిని కలిగిస్తుంది. అందువలన మానవుడు కొన్ని నియమిత రోజుల్లో నిరాహారముగా లేక అల్పాహారముగా గాని ఉండి తన సమయాన్ని శక్తిని ఆదా చేసికోవాలనుకుంటాడు. తద్వారా బుద్ధి చురుకుగాను మనసు పవిత్రముగాను అవుతుంది. అది వరకు ఆహారపుటాలోచనలు కలిగిన మనస్సు ఇప్పుడు ఉన్నతమైన ఆలోచనలతో కూడి భగవంతుని వద్ద నిలుస్తుంది. తనకు తాను నియమించుకొన్న క్రమశిక్షణ కాబట్టి ఆనందంగా ఆ నియమాన్ని మనస్సు అనుసరించే ఉంటుంది.
ఏ పని తీరుకైనా కూడా అది బాగా పనిచేయాలంటే మరమ్మత్తూ మరియు పూర్తి విరామము అవసరము. ఉపవాసంలో నిరాహారముగా లేక అల్పాహారముగా ఉండుట వలన జీర్ణ మండలానికి విశ్రాంతి లభిస్తుంది.
ఇంద్రియాలతో విషయ భోగాలు అనుభవించే కొద్దీ అవి వశము కాక ఇంకా ఎక్కువ కావలెననును. ఉపవాసము మనకు ఇంద్రియ నిగ్రహము అలవరచుకోవడానికి కోర్కెలను ఉదాత్తమైన వాటిగా చేసికోవడానికి శాంతియుత మనస్సును కల్గి ఉండడానికి మార్గము చూపి సహాయ పడ్తుంది.
ఉపవాసము మనలని నీరస పరిచేదిగాను, తొందరగా కోపం కల్గిన్చేటట్లుగాను మరియు తరువాత అనుభవించ వచ్చుననే ప్రేరణ నిచ్చేదిగాను ఉండకూడదు. ఉపవాసము వెనుక ఉన్నతమైన లక్ష్యము లేనప్పుడు ఇట్లా జరుగుతుంది. కొందరు కేవలము బరువు తగ్గించుకునే నిమిత్తమే ఉపవాసం లేదా పత్యం (diet) పాటిస్తారు. మరి కొందరు భగవంతుని మెప్పించడానికి ప్రతిజ్ఞగా లేదా తమ కోరికలను తీర్చుకొనేందుకు, మరి కొందరు సంకల్ప శక్తి వృద్ధి చేసికోవడానికి, సంయమనానికై, కొందరు ఒక విధమైన తపస్సు గాను ఉపవాసము చేస్తారు. మరీ తక్కువగా కాక ఎక్కువగా కాక యుక్త ఆహారము తీసికోవలసినదని కేవలము ఉపవాసము చేయునప్పుడే కాక మిగతా రోజుల్లో కూడా శుచి ఐన బలవర్ధకమైన సాత్విక ఆహారము తీసికోవలసినదిగా భగవద్గీత మనకు బోధిస్తుంది.
దేవాలయంలో గంట మ్రోగిస్తాం ఎందుకు?
చాలా దేవాలయాలలో ప్రవేశద్వారానికి దగ్గర పైకప్పు నుంచీ ఒకటి లేక ఎక్కువ గంటలు వ్రేలాడ దీయబడి ఉంటాయి. భక్తుడు ఆలయంలోకి వెళ్ళగానే గంట మ్రోగించి ఆ తరువాతనే భగవంతుని దర్శనానికి మరియు ప్రార్ధనలకి ఉపక్రమిస్తాడు. పిల్లలు ఎత్తుగా ఉన్న గంటను పైకి ఎగిరి లేక ఎత్తుకోబడి మ్రోగించడానికి ఇష్టపడతారు.
మనము గంటను ఎందుకు మ్రోగిస్తాము?
భగవంతుడిని నిద్ర లేపడానికా? కానీ దేవుడు ఎప్పుడూ నిద్రపోదు. భగవంతునికి మనము వచ్చినట్లు తెలియచేయడానికా? ఆయన సర్వజ్ఞుడు కాబట్టి తెలుపవలసిన అవసరము లేదు. ఆయన ప్రాంగణము లోనికి రావడానికి అనుమతి కొరకా? అది స్వంత ఇంటికి వస్తున్నట్లే గనుక రావడానికి అనుమతి తీసికొన అవసరము లేదు. భగవంతుడు మనలని ఎల్లవేళలా ఆహ్వానిస్తుంటాడు.
మరి మనం గంటను ఎందుకు మ్రోగిస్తున్నట్లు?
గంట మ్రోగించడం ద్వారా వెలువడే శబ్దము మంగళకరమైన ధ్వనిగా పరిగణించ బడుతుంది. ఇది విశ్వానికంతా భగవన్నామమయిన 'ఓంకార' నాదాన్ని ఉద్భవింపజేస్తుంది. సదా శుభప్రదమైన భగవంతుని యొక్క దర్శనము పొందడానికి బాహ్య అంతరాలలో పవిత్రత ఉండాలి అందుకే గంట మ్రోగిస్తాం.
వైదిక క్రియా పరంగా 'హారతి' ఇచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది. మ్రోగే గంట, శంఖము మరియు ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి. ఇది గంట మ్రోగించడము లోని అదనపు సంకేతము.
వైదిక క్రియా పరంగా 'హారతి' ఇచ్చే సమయంలో కూడా మనము గంట వాయించుతాము. ఇది కొన్ని సమయాలలో మంగళకరమైన శంఖారావములతోను మరికొన్ని ఇతర సంగీత వాయిద్యాలతోనూ కూడి ఉంటుంది. మ్రోగే గంట, శంఖము మరియు ఇతర వాయిద్యాలు భక్తులను తమ భక్తి పారవశ్యత, ఏకాగ్రత మరియు అంతరంగ శాంతి నుండి చెదరగొట్టే అమంగళ, అసంగతమైన శబ్దాలు మరియు వ్యాఖ్యానాల నుండి బయట పడడానికి సహాయ పడతాయి. ఇది గంట మ్రోగించడము లోని అదనపు సంకేతము.
మనము చేసే నిత్య పూజ ఆరంభములో ఇలా చెపుతూ గంటను వాయిస్తాము.
ఆగమార్ధంతు దేవానాం గమనార్ధంతు రక్షసాం
కురుఘంటా రవం తత్ర దేవతాహ్వాన లాంఛనం
దైవాన్ని ప్రార్ధిస్తూ నేను ఈ ఘంటారావం చేస్తున్నాను. దాని వలన సద్గుణ దైవీ పరమయిన శక్తులు నాలో ప్రవేశించి (నా గృహము, హృదయము) అసురీ మరియు దుష్టపరమైన శక్తులు బాహ్యాభ్యంతరాలనుండి వైదొలగు గాక!
కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
ముందుగా అసలు కలశము అంటే ఏమిటి?
నీటితో నిండిన ఇత్తడి లేక మట్టి లేక రాగి పాత్ర; పాత్ర మొదట్లో మామిడి ఆకులు; వాటి పైన కొబ్బరి కాయ ఉంచబడుతుంది. తెలుపు లేక ఎరుపు దారం దాని మెడ చుట్టూ లేక పూర్తిగా కానీ సమ చతురస్రాకారపు నమూనాలో చుట్టబడి ఉంటుంది. ఆ పాత్ర చిత్రములతో కూడా అలంకరించబడి ఉండవచ్చు. అటువంటి పాత్ర 'కలశం' అనబడుతుంది. ఆ పాత్రను నీటితో గానీ బియ్యముతో గానీ నింపినప్పుడు "పూర్ణకుంభము" అనబడుతుంది. అది దివ్యమైన ప్రాణశక్తి తో నింపబడిన జడ శరీరానికి ప్రతీక అవుతుంది. ప్రాణశక్తి వలననే అన్ని అద్భుతమైన పనులను చేసే శక్తి శరీరానికి వస్తుంది.
సంప్రదాయ బద్ధమైన గృహ ప్రవేశము, వివాహము, నిత్య పూజ మొదలైన అన్ని ప్రత్యేక సందర్భాలలో తగిన వైదిక క్రియతో 'కలశము' ఏర్పాటు చేయబడుతుంది. స్వాగతానికి చిహ్నంగా ప్రవేశ ద్వారం వద్ద ఉంచబడుతుంది. ఇది మహాత్ములను సంప్రదాయ పద్ధతిలో ఆహ్వానించేటప్పుడు కూడా వాడబడుతుంది.
మనము కలశాన్ని ఎందుకు పూజిస్తాము?
సృష్టి ఆవిర్భావానికి ముందు శ్రీ మహా విష్ణువు పాల సముద్రములో తన నాగశయ్య పై పవ్వళించి ఉన్నాడు. అతని నాభి నుండి వెలువడిన పద్మములో నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవించి ఈ ప్రపంచాన్ని సృష్టించాడు . కలశములొని నీరు సర్వ సృష్టి ఆవిర్భవానికి ప్రధమ జాతమైన నీటికి ప్రతీక గా నిలుస్తుంది. ఇది అన్నింటికీ జీవన దాత. లెక్కలేనన్ని నామరూపాలకి, జడ పదార్దముల మరియు చరించే ప్రాణుల యొక్క అంతర్గత సృష్టికర్త. ఈ ప్రపంచములో ఉన్నదంతా సృష్టికి ముందుగా నున్న శక్తి నుంచి వచ్చినది శుభప్రదమైనది. ఆకులు, కొబ్బరికాయ సృష్టికి ప్రతీక. చుట్టబడిన దారము సృష్టిలో అన్నింటినీ బంధించే 'ప్రేమ' ను సూచిస్తుంది. అందువల్లనే 'కలశం' శుభసూచకముగా పరిగణింపబడి పూజింపబడుతున్నది.
అన్ని పుణ్య నదులలోని నీరు, అన్ని వేదాలలోని జ్ఞానము మరియు దేవతలందరి ఆశీస్సులు కలశంలోకి ఆహ్వానించ బడిన తరువాత అందులోని నీరు "అభిషేకము" తో సహా అన్ని వైదిక క్రియలకి వినియోగింప బడుతుంది. దేవాలయ కుంభాభిషేకములు ఎన్నో రకాల పూజలు కలశ జలముల అభిషేకములతో విశిష్ట పద్దతిలో నిర్వహిస్తారు. పాల సముద్రాన్ని రాక్షసులు, దేవతలు మధించినపుడు అమరత్వాన్ని ప్రసాదించే అమృత కలశముతో భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. కనుక 'కలశం' అమృతత్వాన్ని కూడా సూచిస్తుంది.
పూర్ణత్వాన్ని సంతరించుకున్న జ్ఞానులు ప్రేమ, ఆనందాలతో తొణికిసలాడుతూ పవిత్రతకు ప్రతీక గా ఉంటారు. వారిని ఆహ్వానించేటప్పుడు వారి గొప్పదనానికి గుర్తింపుగా మరియు వారిపట్ల గల గౌరవనీయమైన భక్తికి నిదర్శనంగా పూర్ణ కుంభము తో హృదయ పూర్వకముగా స్వాగతమిస్తాము.
తులసిని పూజిస్తాము ఎందుకు?
హిందువుల గృహాలలో ముందర, వెనుక లేక పెరట్లో మధ్య స్థలంలో 'తులసి కోట నిర్మించబడి ఉంటుంది. ఈ రోజుల్లో చిన్న చిన్న వాటాల (అపార్టుమెంట్లు) లోని వారు కూడా పూల తొట్టెలలో తులసి మొక్కను పోషించుకొంటున్నారు. ఇంటి ఇల్లాలు తులసి మొక్కకు నీరు పోసి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేస్తుంది. తులసి మొక్క ఆకులు, విత్తనాలు మొక్కకు ఆధారమైన మట్టితో సహా అన్ని భాగాలు పవిత్రమైనవిగా పరిగణించ బడతాయి. భగవంతునికి నివేదింపబడే నైవేద్యములో ఎప్పుడూ తులసి ఆకులు ఉంచబడతాయి. భగవంతుడికి చేసే పూజలలో, ప్రత్యేకించి శ్రీ మహావిష్ణు అవతార మూర్తుల పూజలలో తులసి సమర్పించ బడుతుంది.
మనము తులసిని ఎందుకు పూజిస్తాము?
సంస్కృతములో 'తులనా నాస్తి అథైవ తులసి' అంటే దేనితోను పోల్చలేనిది తులసి (దాని లక్షణాలలో) అని అర్ధము. భారతీయులకు గల పవిత్రమైన మొక్కలలో ఇది ఒకటి.
వాస్తవానికి ఇది స్వశుద్ధికారి కనుకనే పూజా సమయాలలో వినియోగించే వస్తువులలో ఇదొక్కటే ఒకసారి వాడిన తరువాత కడిగి మళ్ళీ పూజకు వాడదగినదిగా పరిగణించవచ్చు.
ఒక కధనం ప్రకారము తులసి ఒక దేవత. ఆమె శంఖచూడునికి భక్తి శ్రద్ధలు గల భార్య. ఆమెలోని భక్తి, ధర్మశీలత యందు గల విశ్వాసములను చూచి భగవంతుడు ఆమెను పూజార్హత గల తులసి మొక్కగాను మరియు భగవంతుని తలమీద అలంకరింప బడే యోగ్యత గలది గాను దీవించాడు. తులసి ఆకుని సమర్పించకుండా చేసిన ఏ పూజ అయినా అసంపూర్ణమే. అందువలననే తులసి పూజింప బడుతుంది (కొన్ని పూజలలో తులసి వాడకూడదు అంటారు. విష్ణు పూజ కి సంబంధించి మాత్రం తప్పక వాడ వలసినది).
ఇంకో కధనం ప్రకారము - భగవంతుడు తులసికి తన అర్ధాంగి అయ్యేలాగ వరమిచ్చాడు. అందువలన ఆమెకు భగవంతునితో చాల ఆడంబర పూరితముగా వివాహ మహోత్సవం జరుపుతాము. ఈ విధముగా విష్ణు మూర్తి భార్య యగు లక్ష్మీ దేవికి కూడా తులసి ప్రతీక. ఎవరైతే ధర్మబద్ధమైన సంతోషకరమైన గృహస్థ జీవితాన్ని గడపాలని కోరుకుంటారో వారు తులసిని పూజిస్తారు.
ఒకసారి సత్యభామ కృష్ణ భగవానుడిని తన దగ్గరున్న విలువైన సంపదతో తులాభారము చేస్తుంది. కానీ ఆ సంపదతో పాటు రుక్మిణీ దేవి భక్తితో ఒక్క తులసీదళం వేసే వరకు ఆ తులామానం సరితూగలేదు. ఆ విధంగా తులసి ప్రపంచంలోని మొత్తము సంపద కంటే భక్తితో సమర్పించే చిన్న వస్తువైనా సరే గొప్పదిగా భగవంతుడు స్వీకరిస్తాడని ప్రపంచానికి నిరూపించడములో ప్రధాన పాత్ర పోషించినది.
తులసి ఆకు చాల విశేషమైన ఔషధ విలువలని కలిగి ఉన్నది. జలుబుతో సహా వివిధ అనారోగ్యాలను నయం చేయడానికి వాడబడుతుంది.
తులసి మాల తో జపం చేస్తే చిత్తశుద్ది త్వరగా కలిగి తద్వారా మోక్షం లభిస్తుంది. చిత్తశుద్ది కి తులసి మాల ఉత్తమం.
తులసిని దర్శించినప్పుడు స్మరించవలసిన శ్లోకము:
యన్మూలే సర్వ తీర్ధాణి యదగ్రే సర్వ దేవతాః
యన్మధ్యే సర్వ వేదాశ్చ తులసీం తాం నమామ్యహమ్
ఎవరి మూలములో సర్వ పుణ్య తీర్ధాలు ఉన్నాయో, ఎవరి అగ్రములో సర్వ దేవతలున్నారో మరియు ఎవరి మధ్య భాగంలో సర్వ వేదాలున్నాయో అట్టి తులసికి ప్రణమిల్లుతున్నాను.
తామర పూవుని ప్రత్యేకమైనదిగా పరిగణిస్తాము - ఎందుకు?
తామర పూవు భారత దేశ జాతీయ పుష్పముగా గుర్తింపు పొందినది. ఈ గుర్తింపు సరైనటువంటిదే. కొద్ది కాలము క్రితము వరకు కూడా భారత దేశపు చెరువులు, కొలనులు ఎన్నో రంగు రంగుల తామర పుష్పములతో నిండి ఉండేవి.
తామర పూవుని ప్రత్యెకమైనదిగా పరిగణించుట ఎందుకు?
తామర పూవు సత్యము పవిత్రత మరియు సుందరత్వానికి ప్రతీక. భగవంతుని స్వభావము కూడా సత్యం శివం సుందరమూ. కనుక అతని వివిధ భాగాలు పద్మముతో పోల్చబడతాయి. మన వేదాలు, ఇతిహాసాలు తామర పూవు అందాలని స్తుతించుతాయి. చిత్రకళ శాస్త్రములు కూడా తామర పూవుని వివిధ అలంకారయుత చిత్రాలుగా చిత్రీకరిస్తుంటాయి. చాలా మంది తామర పూవు లేదా దానికి సంబంధించిన పేర్లను కలిగి ఉంటారు. సంపదకు అధి దేవత ఐన లక్ష్మీ దేవి ఒక తామర పూవు పైన ఆసీనమై మరొక తామర పూవుని తన హస్తముతో పట్టుకొని ఉంటుంది.
తామర పూవు ఉదయించే సూర్యునితో పాటు విచ్చుకొని రాత్రికి ముడుచుకొని పోతుంది. అదే విధంగా మన బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికాసము, వృద్ధి చెందుతాయి. తామర పూవు బురద గుంటల్లో కూడా పెరుగుతుంది. దాని పరిసరాలు ఏ విధముగా ఉన్నప్పటికీ తాను మాత్రము కళంకము లేకుండా అందంగా ఉంటుంది. మనము కూడా బాహ్య పరిస్థితులు ఏ రకముగా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యము చెదరకుండా ఉండాలని, ఉండగలగటానికి పాటుపడాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నీళ్ళలోనే ఉన్నప్పటికీ తామర ఆకుకి తడి అంటుకోదు. జ్ఞాని దుఃఖాలతోను మార్పులతోనూ కూడుకొన్న ప్రపంచములో ఉన్నప్పటికీ వాటికి చలించకుండా ఆత్మానందములోనె లీనమై ఉంటాదనడానికి ప్రతీకగా ఈ విషయము నిలుస్తుంది. భగవద్గీత లోని ఒక శ్లోకము ద్వారా ఈ విషయము తెలియజేయ బడింది.
తామర పూవు ఉదయించే సూర్యునితో పాటు విచ్చుకొని రాత్రికి ముడుచుకొని పోతుంది. అదే విధంగా మన బుద్ధులు జ్ఞానమనే వెలుగుతో వికాసము, వృద్ధి చెందుతాయి. తామర పూవు బురద గుంటల్లో కూడా పెరుగుతుంది. దాని పరిసరాలు ఏ విధముగా ఉన్నప్పటికీ తాను మాత్రము కళంకము లేకుండా అందంగా ఉంటుంది. మనము కూడా బాహ్య పరిస్థితులు ఏ రకముగా ఉన్నప్పటికీ అంతర్గతమైన పవిత్రత, సౌందర్యము చెదరకుండా ఉండాలని, ఉండగలగటానికి పాటుపడాలని గుర్తు చేస్తూ ఉంటుంది. ఎప్పుడూ నీళ్ళలోనే ఉన్నప్పటికీ తామర ఆకుకి తడి అంటుకోదు. జ్ఞాని దుఃఖాలతోను మార్పులతోనూ కూడుకొన్న ప్రపంచములో ఉన్నప్పటికీ వాటికి చలించకుండా ఆత్మానందములోనె లీనమై ఉంటాదనడానికి ప్రతీకగా ఈ విషయము నిలుస్తుంది. భగవద్గీత లోని ఒక శ్లోకము ద్వారా ఈ విషయము తెలియజేయ బడింది.
బ్రాహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః
లిప్యతే నసపాపేన పద్మ పాత్ర మివాంభసా
భగవంతుడికి అర్పించి ఫలాపేక్ష వదిలి, ఎవరు కర్మలు చేస్తారో, తామరాకుకి నీరు లాగ వారికి పాపము అంటుకోదు.
దీనివలన జనానికి ఏదైతే సహజ లక్షణమో అది సాధకులందరికీ ఆధ్యాత్మ అన్వేషకులకి భక్తులకి ఆచరించ వలసిన క్రమ శిక్షణ అవుతుందని మనము తెలుసుకొన్నాము.
యోగ శాస్త్ర ప్రకారము మన దేహాలు శక్తి కేంద్రాలయిన కొన్ని చక్రాలను కలిగి ఉన్నాయి. ప్రతి చక్రము నియమిత దళముల పద్మమును కల్గి ఉంటుంది. ఉదాహరణకు శిరోభాగమున గల సహస్ర చక్రము, యోగి ఆత్మ జ్ఞానాన్ని పొందినప్పుడు వికసిస్తుంది. దీనిని వెయ్యి దళములు గల పద్మముతో సూచిస్తారు. అంతే కాకుండా ధ్యానానికి కూర్చోవడానికి పద్మాసనము సిఫారసు చేయబడింది.
విష్ణు భగవానుని నాభి నుంచీ ఆవిర్భవించిన తామర పూవు నుండి బ్రహ్మదేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించడానికై ఉద్భవించాడు. ఆ విధముగా తామరపూవు సృష్టి కర్తకీ మరియు పరమాత్మకు గల సంబంధానికి చిహ్నంగా నిలుస్తున్నది. ఇది బ్రహ్మదేవుని నివాస స్థానమైన బ్రహ్మలోకానికి కూడా చిహ్నము.
శుభ సూచకమైన స్వస్తిక్ గుర్తు కూడా తామర పూవు నుంచే వెలువడినట్లు చెప్పబడుతుంది.
తామర భారత జాతీయ పుష్పముగా ఎందుకు ఎన్నుకోబడినదో, భారతీయులకి ఎందుకది అంత ప్రత్యేకమైనదో మనము పై విషయాల ద్వారా చక్కగా తెలుసుకున్నాము.
శంఖము ఎందుకు ఊదుతాము?
దేవాలయాలలో గానీ ఇళ్ళలో గానీ శాస్త్రోక్త పూజారంభ సమయములో ఒక్కసారి లేక అనేక సార్లు శంఖము పూరించ బడుతుంది. హారతి ఇచ్చేటప్పుడు గానీ లేక సుభసూచకమైన సందర్భాన్ని గుర్తించడానికి గానీ శంఖము ఊదబడుతుంది. యుద్ధం ఆరంభించడానికి ముందర లేక సైన్యపు విజయాన్ని ప్రకటించడానికి గానీ శంఖారావము చేయబడుతుంది. శంఖము దైవ పీఠము వద్ద కూడా పెట్టి పూజించ బడుతుంది.
శంఖము ఎందుకు ఊదుతాము.
ఎప్పుడైతే శంఖము ఊదబడుతుందో, అప్పుడు అందుండి సృష్టికి మూలభూతమైన ప్రణవ నాదము వెలువడుతుంది. ఓంకారము సృష్టికి పూర్వము భగవంతునిచే చేయబడిన మంగళకరమైన నాదము. అది ప్రపంచానికి, దానికి ఆధారమైన సత్యానికి ప్రతినిధి.
ఒక కథనం ప్రకారం శంఖాసురుడనే రాక్షసుడు దేవతలను ఓడించి వేదాలను అపహరించి సముద్రపు అడుగు భాగములోకి వెళ్ళాడు. దేవతలు సహాయము కొరకు విష్ణుమూర్తికి విన్నవించుకొన్నారు. శ్రీ మహావిష్ణు 'మత్స్యావతారము' ధరించి శంఖాసురుణ్ణి సంహరించాడు. భగవానుడు శంఖాకారములో ఉన్న అతని చెవి మరియు తల ఎముకను ఊదగా అందుండి వేదాలను ఉద్భవిమ్పచేసినట్టి నాదము వెలువడింది. వేదాలలో ఉన్న జ్ఞానమంతా ఓంకారము యొక్క వివరణయే. శంఖము 'శంఖాసురుని' మరణానంతరము 'శంఖము' గా పిలవబడుచున్నది. భగవానునిచే పూరించబడిన శంఖము 'పాంచ జన్యము' గా పిలువ బడుచున్నది. ఆయన నాలుగు చేతులలోని ఒక చేతిలో ఎల్లవేళలలో శంఖము పట్టుకొని ఉంటాడు. అది జీవితపు చతుర్విధ పురుషార్ధాలలో ఒకటయిన 'ధర్మము' లేక ధర్మశీలతకుప్రతీక . అందువల్లనే శంఖారావము అధర్మముపై ధర్మము యొక్క విజయానికి సంకేతము. శంఖాన్ని మన చెవులకి దగ్గరగా పెట్టుకొంటే సముద్రపు అలల హోరు వినబడుతుంది.
భక్తుల మనసులను వాతావరణమును కలవరపెట్టే వ్యతిరేక వ్యాఖ్యానాలను మోతలను పూర్తిగా తరిమెయ్యడానికి గాను శంఖము మరియు ఇతర వాయిద్యాలను మ్రోగించి మంగళకరమైన ధ్వనులను ఉత్పన్నము చేయడము అనేది మరియొక ముఖ్య ఉద్దేశ్యము.
పురాతన భారత దేశము గ్రామాలలో నివసిస్తూ ఉండేది. ప్రతి గ్రామము ఒక ప్రధాన దేవాలయము మరియు అనేక చిన్న దేవాలయాల అధ్యక్షతలో ఉండేది. ప్రతి ముఖ్యమైన పూజ ముగింపులోను మరియు పుణ్య దినాలలోనూ హారతి తో పాటు శంఖారావము చేయబడుతుంది. సాధారణంగా గ్రామము చిన్నదిగా ఉండడం వలన ఆ శంఖనాదం ఊరంతటికీ వినిపించేది. దేవాలయానికి వెళ్ళడానికి వీలుకాని ప్రజలంతా వారు ఏ పని చేస్తున్నా ఆ పని ఆపి కొన్ని క్షణాల పాటైనా మానసికంగా భగవంతుడికి ప్రణమిల్లాలని గుర్తు చేయబడేది. ఈ శంఖ నాదం తీరిక లేని నిత్య కృత్యాల మధ్య నున్న ప్రజల మనసులని కూడా భక్తి భావాలతో నింపుతూ సేవను అందించేది.
నాద బ్రహ్మము, సత్యము, వేదాలు, ఓంకారము, ధర్మమూ, విజయము మరియు శుభసూచకాలకి ప్రతీకగా దేవాలయాల లోను, ఇళ్ళలోనూ, దైవ పీఠము వద్ద, భగవంతునికి ప్రక్కగా శంఖము ఉంచ బడుతుంది. భక్తుల మనసులు ఉన్నతమై సత్యం వైపు ఎదగడానికి ఇచ్చే తీర్ధమునకు కూడా శంఖము వాడ బడుతుంది.
ఈ క్రింది శ్లోకముతో శంఖము పూజింపబడుతుంది.
త్వం పురా సాగరోత్పన్నః విష్ణునా విద్రుతః కరే
దేవైశ్చ పూజితః సర్వైః పాంచజన్యం నమోస్తుతే
సముద్రములో పుట్టిన, విష్ణుమూర్తి చేత బట్టిన మరియు దేవతలందరిచే పూజింపబడిన పాంచజన్యమను శంఖమునకు వందనము.
శాంతి వచనము మూడు సార్లు చెప్తాము - ఎందుకు?
శాంతి అంటే అర్ధము ప్రశాంతత, అదే జీవి యొక్క సహజమైన స్థితి. సహజ స్థితి ని భంగం కలిగించేవి అన్నీ అశాశ్వతాలే. శబ్దాలు, ఆందోళనలు మరి ఏ ఇతర అడ్డంకులు మనచే గానీ ఇతరులచే గానీ కలిగిం చబడతాయి. ఉదాహరణకి ఒక స్థలములో ఎవరైనా శబ్దము చేసే వరకు అక్కడ ఉండేది ప్రశాంతతే. కాబట్టి మన అన్ని ఆందోళనలు అంతర్లీనంగా శాంతిని కలిగే ఉన్నాయి. ఆందోళనలు ముగిసిన వెంటనే అప్పటికే అక్కడ ఉన్నందువల్ల శాంతి సహజంగానే అనుభవంలోనికి వస్తుంది. ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ సంతోషం ఉంటుంది. అందువలన ఏ మినహాయింపు లేకుండా ప్రతి ఒక్కరూ తన జీవితంలో శాంతిని కోరుకుంటారు. ఐనప్పటికీ మన స్వంత ఆందోళనల చేత కప్పివేయబడినందువల్ల, అంతరంగికంగా గానీ బాహ్యంగా గానీ 'శాంతి' ని పొందడము చాల కష్టమనిపిస్తుంది. చాల అరుదైన కొందరు మాత్రమే బాహ్యమైన ఆందోళనలు, కష్టాల మధ్య కూడా శాంతియుతంగా ఉండ గలుగుతారు. మనము శాంతిని పొందడానికి ప్రార్ధనలు చేస్తాము. ప్రార్ధనలు చేయడం వలన కష్టాలు ముగిసి బాహ్యఆందోళనలతో సంబంధం లేకుండా అంతరంగికంగా శాంతి అనుభవములోకి వస్తుంది. అటువంటి ప్రార్ధనలన్నీ మూడు సార్లు శాంతి పలకడముతో ముగుస్తాయి.
మనము మూడు సార్లు శాంతి వచనము ఎందుకు చెప్తాము?
'త్రివారం సత్యం' అనబడుతుంది. ఏదైనా ఒక విషయాన్ని నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు అదే విషయాన్ని పునరావృతం చేస్తాము. న్యాయ స్థానము లో కూడా, సాక్ష్యం చెప్పడానికి నిలబడినవారు "నేను నిజమే చెప్తాను, అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప మరి ఇంకేమి చెప్పను" అని మూడు సార్లు చెప్తారు. మనకు శాంతి పొందాలన్న కోరిక యొక్క తీవ్రతను నొక్కి చెప్పడానికి మనము మూడు సార్లు శాంతి వచనము వల్లిస్తాము.
అన్ని రకాల విఘ్నాలు, సమస్యలు, మరియు దుఃఖాలు మూడు విధాలుగా ఉత్పన్నమవుతాయి.
1. అధిదైవిక: ఏ మాత్రము మన అదుపులో లేని దైవీ శక్తుల వలన ఏర్పడే భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు మొదలగునవి.
2. అధిభూత: మనచుట్టూ ఉండి మనకు తెలిసిన ప్రమాదాలు, మానవ సంబంధాలు, కాలుష్యము నేరములు మొదలగునవి.
3. ఆధ్యాత్మిక: శారీరక వ్యాధులు, కోపము, నిరుత్సాహము వంటి మానసిక సమస్యలు.
మనమేదైనా ప్రత్యేకమైన పని చేసేటప్పుడు మరియు నిత్య జీవితములో పైన వివరించబడిన మూడు మూలకారణాల వలన ఏ సమస్యలు లేకుండగా లేక సమస్యలను తగ్గించమని "శాంతి ఒక్కటే ఉండుగాక!" అని భగవంతుని ప్రార్థిస్థాము. కాబట్టి మూడు సార్లు శాంతి వచనము చేయబడుతుంది.
మొదటి సారి దూరంగా ఉన్న అవ్యక్త శక్తులను ఉద్దేశించి శాంతి వచనము చేయబడుతుంది. మన వెనువెంట ఉన్న పరిసరాలను మరియు చుట్టుప్రక్కల ఉన్న వ్యక్తులను ఉద్దేశించి రెండవసారి కొంత మృదువు గాను; తమకు తాము ఉద్దేశించి చివరి సారి బాగా మృదువుగాను శాంతి వచనము చేయబడుతుంది.
కొబ్బరి కాయను నివేదిస్తాము - ఎందుకు?
భారత దేశపు దేవాలయాలలో చేసే అత్యంత సామాన్య నివేదనలలో కొబ్బరికాయ ఒకటి. వివాహములు పండుగలు, కొత్త వాహనము, వంతెన, ఇల్లు మొదలగునవి వాడేటప్పుడు మరియు అన్ని శుభ సందర్భాలలోనూ కొబ్బరికాయ నివేదింపబడుతుంది. నీటితో నిండి మామిడి ఆకులతో అలంకరింపబడి దానిపై కొబ్బరికాయ ఉన్న కలశమును ముఖ్యమైన పూజా సందర్భాలలో మరియు ప్రత్యేక అతిథులను ఆహ్వానించడానికి ఉపయోగించబడుతుంది.
హోమము చేసే సమయములో ఇది హోమాగ్నికి ఆహుతిగా అర్పించ బడుతుంది. భగవంతుని మెప్పుకై, కోరికలు తీర్చుకొనడానికి కొబ్బరికాయ పగుల గొట్టబడి స్వామికి నైవేద్యముగా పెట్టబడుతుంది. తరువాత ప్రసాదముగా పంచ బడుతుంది.
ఒకానొకప్పుడు మనలోని జంతు ప్రవృత్తులను భగవంతునికి సమర్పించడానికి గుర్తుగా జంతుబలి అమలులో ఉండేది. నెమ్మదిగా ఆ ఆచారము తగ్గిపోయి దానికి బదులుగా కొబ్బరికాయ నివేదించ బడుతున్నది. ఎండిన కొబ్బరి కాయకు పై భాగములో పిలకకోసం మాత్రము వదిలి, మిగతా పీచు అంతా తీసి వెయ బడుతుంది. పైన ఉన్న గుర్తులు మానవుని తల మాదిరిగా కనిపిస్తాయి. పగిలిన కొబ్బరికాయ అహంకారము యొక్క విరుపును ప్రతిబింబింప చేస్తుంది. మనలోని అంతరంగ ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక ఐన లోపలి నీరు, మనసుకు ప్రతీక ఐన కొబ్బరితో సహా భగవంతునికి నివేదింప బడతాయి. భగవంతుని స్పర్శతో శుద్ధి అయిన మనసు ప్రసాదం గా వినియోగించ బడుతుంది. దేవాలయాల్లోనూ ఇళ్ళల్లోను చేసే సంప్రదాయ బద్దమైన పంచామృత అభిషేక ప్రక్రియలో విగ్రహం పైనుంచీ పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, గంధపు మిశ్రమము, విభూతి మొదలగు వాటితో అభిషేకము చేస్తారు. ప్రతి ఒక్క పదార్ధము భక్తులకి ప్రయోజనాలను కల్గించే ఒక ప్రత్యేకమైన గుర్తింపు గలిగి ఉన్నది. సాధకునికి ఆధ్యాత్మిక ఉన్నతిని కలిగిస్తుందనే నమ్మకముతో కొబ్బరినీరు అభిషేక ప్రక్రియలలో వాడబడుతుంది.
కొబ్బరికాయ ఫలాపేక్ష రహిత సేవకి కూడా ప్రతీక. చెట్టు యొక్క ప్రతి భాగము - మ్రాను, ఆకులు, కాయ, పీచు మొదలైనవి ఇంటి కప్పు, చాపలు రుచికరమైన వంటకాలు, తైలము, సబ్బులు మొదలైన వాటి తయారీ లో ఉపయోగించ బడతాయి. ఇది భూమిలోనుంచి ఉప్పు నీటిని తీసికొని బలవర్ధకమైన నీటిగా మార్చుతుంది. ఈ నీరు ప్రత్యేకముగా రోగులకు ఉపయోగ పడుతుంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందుల్లోనూ ఇతర ప్రత్యామ్నాయ వైద్య విధానాలలోను వాడబడుతుంది.
కొబ్బరి కాయకు పైనున్న మూడు కళ్ళ గుర్తుల్ని బట్టి త్రినేత్రుడైన పరమశివునికి ప్రతీకగా భావిస్తారు. అందువల్లనే మన కోరికలు తీర్చడానికి అది సాధనంగా పరిగణించ బడుతుంది. కొన్ని వైదిక ప్రక్రియలలో పరమ శివునికి మరియు జ్ఞానికి ప్రతీకగా కొబ్బరి కాయ కలశం పై పెట్టబడి అలంకరింపబడి, మాలాలంకృతము చేయబడి పూజింపబడుతుంది.
ఓంకారము పలుకుతాము - ఎందుకు?
భారత దేశములో ఎక్కువగా పలుకబడే శబ్ద చిహ్నము ఓంకారము. ఓంకారము - ధ్వనింపచేసే వారి శరీరము, మనసులపైన మరియు పరిసరాల పైన కూడా పరిపూర్ణ ప్రభావము ఉంటుంది. చాలా మంత్రాలు, వైదిక ప్రార్ధనలు ఓంకారముతో ఆరంభమవుతాయి. ఓంహరిఃఓం మొదలైన అభినందనలలో కూడా అది వాడబడుతుంది. దాని ఆకారము పూజింపబడుతుంది. దానిపై భావన చేయబడుతుంది. శుభసూచకంగా వాడబడుతుంది. ఇది మంత్రము మాదిరి గానే పదే పదే జపించ బడుతుంది.
ఓంకారము ఎందుకు చేస్తాము?
ఓం అనేది భగవంతుని యొక్క ప్రధమ నామము. అది అ, ఉ, మ అనే అక్షరాల కలయిక వలన ఏర్పడినది. స్వరస్నాయువుల నుండీ వెలువడే శబ్దము గొంతు యొక్క అడుగు భాగము నుంచీ 'అ'కారముగా ఆరంభమవుతుంది. పెదిమలు మూసుకొన్నప్పుడు 'మ'కారము తో శబ్దము ఆగిపోతుంది. మూడు అక్షరాలూ, మూడు అవస్థలు (జాగ్రత్, స్వప్న, సుషుప్తి), ముగ్గురు దేవతలు (బ్రహ్మ విష్ణు, మహేశ్వర), మూడు వేదాలు (ఋగ్, యజుర్, సామ), మూడు లోకాలు (భూః, భువః, సువః) మొదలైన వాటికి ప్రతీకలు. ఇవి అన్నీ మరియు వీటన్నింటికి ఆవల ఉన్నవాడు "భగవంతుడు" రెండు ఓంకార ధ్వనుల మధ్యనున్న నిశ్శబ్దము నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని సూచిస్తుంది. ఓంకారం ప్రణవము అని కూడా పిలువబడుతుంది ("దేని ద్వారా అయితే భగవంతుడు స్తుతించ బడతాడో" అని అర్ధము). వేదాలలోని సారమంతా "ఓం" అనే పవిత్రాక్షరములో నిక్షిప్తమైనది.
భగవంతుడు ఓంకారము మరియు 'అథ' అని పలికిన తరువాత ప్రపంచాన్ని సృష్టించడం ఆరంభించాడని చెప్ప బడుతుంది. కాబట్టే మనం తలపెట్టే ఏ పని ఆరంభము లోనయినా ఓంకార నాదము శుభ సూచకంగా పరిగణించ బడుతుంది.
ఓంకారనాదము చేసినప్పుడు వచ్చే శబ్దము గంట యొక్క ప్రతిధ్వనిని పోలి ఉండాలి (ఓంooooo...మ్ మ్) అది మనసుని శాంతింపచేసి పరిపూర్ణమైన సూక్ష్మమైన శబ్దంతో సంధింప జేస్తుంది. మానవులు దాని అర్ధంపైన ధ్యానం చేసి ఆత్మానుభవాన్ని పొందుతారు.
ఓంకారం వేర్వేరు ప్రాంతాలలో వేర్వేరు విధాలుగా వ్రాయ బడుతుంది. సర్వ సాధారణమైన ఓం ఆకారము గణేశుడికి చిహ్నముగా ఉంటుంది. పైన ఉన్న వంపు తల, క్రిందగా ఉన్న పెద్ద వంపు పొట్ట ప్రక్కగా ఉన్నది తొండము మరియు చుక్కతో ఉన్న అర్ధచంద్రాకారము గణేశ భగవానుడి చేతిలో ఉన్న మోదకము.
ఈ విధముగా ఓంకారము జీవనగమ్యం, సాధన, ప్రపంచము దాని వెనుక ఉన్న సత్యము భౌతికము అభౌతికము సాకార-నిర్వికారములు అన్నింటిని తెలియబరుస్తుంది.
హారతి ఇస్తాము - ఎందుకు?
భగవంతుని ప్రార్ధన, పూజ లేదా భజన చివర్లో లేక గౌరవనీయులైన అతిథిని లేక మహాత్ముడిని ఆహ్వానించేటప్పుడు హారతి ఇస్తాము. ఇదెప్పుడూ ఘంటా నాదం తోను కొన్ని సమయములలో పాటలు ఇతర సంగీత వాయిద్యాలతోను, మరియు చప్పట్లతోను కలిసి ఉంటుంది.
ఇది పదహారు అంచెలుగా చేసే షోడశోపచార పూజా కార్యక్రమములోని ఒక భాగము. ఇది శుభసూచకమైన మంగళ నీరాజనముగా సూచింప బడుతుంది. భగవంతుని రూపాన్ని ప్రకాశింప చేయడానికి మనము కుడిచేతిలో వెలుగుతున్న దీపాన్ని పట్టుకొని వలయాకార దిశలో హారతి ఇచ్చేటప్పుడు దీపపు వెలుగులో ప్రకాశించే భగవంతుని సుందర రూపాన్ని ప్రతిభాగము విడిగాను మరియు పూర్తి రూపము శ్రద్ధగా గమనిస్తూ మనసులో గానీ పైకి గట్టిగా గానీ స్తోత్రాలు చదవడము చేస్తాము. ఆ సమయంలో మన ప్రార్ధనలో తపన మరియు భగవంతుని రూపములో ప్రత్యేకమైన సౌందర్యము మనకు అనుభవమవుతుంది. చివరలో ఆ వెలుగు పై మన చేతులనుంచి తరువాత నెమ్మదిగా మన కళ్ళకు తల పైభాగానికి అద్దుకొంటాము.
మనము చిన్నప్పటి నుంచీ ఈ ప్రక్రియను చూస్తున్నాము. అందులో పాల్గొంటున్నాము. మనము హారతి ఎందుకు ఇస్తామో తెలుసుకుందాము.
ఇష్టపూర్వకముగా భగవంతుడిని పూజించినప్పుడు, అభిషేకం చేసినప్పుడు, అలంకరించినప్పుడు, ఫలములు మరియు మధుర పదార్థములతో నివేదించినప్పుడు వైభవోపేతమైన ఆయన సుందర రూపాన్ని చూడగలము. దీపపు వెలుగుచే ప్రకాశవంతము గా కనపడుతున్న భగవంతుని ప్రతి భాగము మీద మనస్సు సంధించబడి అతని రమ్యమైన రూపముపై మనసు మెలకువతో నిశ్శబ్ద ధ్యానం చేస్తుంది. గానం చెయ్యడం చప్పట్లు చరచడం, గంట వాయించడం మొదలైనవన్నీ భగవంతుని దర్శనముతో కల్గిన సంతోషాన్ని మరియు శుభ సూచకాన్ని తెలుపుతాయి.
హారతి సాధారణంగా కర్పూరంతో ఇవ్వబడుతుంది. కర్పూరాన్ని వెలిగించినపుడు ఏ మాత్రము చాయలు మిగల్చకుండా తనకు తాను పూర్తిగా కాలిపోతుంది. కర్పూరం మన అంతర్గత ప్రవృత్తులకు (వాసనలు) ప్రతీక. జ్ఞానమనే అగ్నిచేత వెలిగించ బడినప్పుడు ఏదైతే భగవంతుడిని ప్రకాశింప చేస్తుందో ఆ జ్ఞానాగ్నే మన వాసనలు పూర్తిగా దగ్దము చేసి భగవంతుడి నుంచి దూరము చేసే అహంకారాన్ని నిర్మూలిస్తుంది. కర్పూరము వెలుగుతున్నప్పుడు భగవంతుని విభూతిని శోభను తెలుపడానికి అది తనను తాను ఆహుతి చేసుకొంటూ కూడా చక్కని సువాసనని వెలువరిస్తుంది. మన ఆధ్యాత్మిక పురోభివృద్ధిలో మనము మన గురువునీ సంఘాన్నీ సేవించుకుంటూ అందరికి 'ప్రేమ' అనే 'సుగంధాన్ని' వ్యాపింపచేయడానికి మనస్పూర్తిగా మనలని మనము అర్పించుకోవాలి.
తరచూ మనము ప్రకాశింపచేసే భగవంతుణ్ణి చూడడానికి చాలాసేపు వేచి ఉంటాము. కానీ మనలోపల చూసుకోవడానికా అన్నట్లు హారతి ఇచ్చే అసలు సమయానికి అయాచితంగా కళ్ళు మూత పడతాయి. మన దేహము దేవుని ఆలయమనీ, లోపల దివ్యత్వాన్ని కలిగి ఉన్నామని ఈ విధంగా కళ్ళు మూయడం సూచిస్తుంది. పూజారి హారతి వెలుగులో భగవంతుడిని స్పష్టంగా చూపించినట్లుగానే, గురువు గారు కూడా జ్ఞానమనే వెలుగు సహాయముతో ప్రతి ఒక్కరికి లోనున్న దివ్యత్వాన్ని స్పష్టంగా తెలియపరుస్తారు. హారతి చివరిలో దానిపై చేతులుంచి తరువాత కళ్ళకి, తలపైభాగానికి అడ్డుకోవడమంటే అర్ధము - భగవంతుడిని ప్రకాశింపజేసిన ఈ వెలుగు నా దృష్టిని వెలిగించుగాక! నా దృష్టి పవిత్రమగు గాక నా ఆలోచనలు ఉన్నతముగాను మంచివి గాను ఉండుగాక! అని ప్రార్ధించడం.
హారతికి వేదాన్తపరమైన అర్ధము; సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు విద్యుత్ మరియు అగ్ని - ఇవి వెలుగుకి సహజమైన మూల కారణములు. సృష్టిలోని అద్భుతమైన అపూర్వమైన వాటన్నింటికి భగవంతుడు ఆధారము. ఆయన కారణముగానే మిగిలినవి ఏవైనా ఉండటమూ మరియు ప్రకాశించడమూ జరుగుతుంది. హారతి వెలుగులో భగవంతుడిని ప్రకాశింప చేసినప్పుడు మన దృష్టిని అన్ని వెలుగులకు మూల కారణము మరియు జ్ఞానాన్ని జీవితాన్ని సూచించే పరమాత్మ వైపు మళ్లిస్తాము.
సూర్యుడు బుద్ధికి, చంద్రుడు మనసుకి, అగ్ని వాక్కుకీ అధిదేవతలు. భగవంతుడు వీటన్నింటిని వెలిగించే అత్యున్నతమైన చైతన్యము. అతను లేకుండా బుద్ధి ఆలోచించలేదు. మనసు భావింపలేదు. నాలుక మాట్లాడ లేదు. మనసు బుద్ధి మరియు వాక్కులకీ వెనుక ఉన్నదీ భగవంతుడే. ఈ పరిమితమైన ఉపకరణాలు ఆ అపరిమితమైన భగవంతుడిని ఏ విధముగా ప్రకాశింపజేయగలవు. అందుకే హారతి ఇచ్చేటప్పుడు మనము ఈ క్రింది విధముగా స్తుతిస్తాము.
న తత్ర సూర్యోభాతి న చంద్ర తారకం
నేమా విద్యుతో భాంతి కుతొ2 యమగ్నిః
తమేవ భాంత మనుభాతి సర్వం
తస్యభాసా సర్వమిదం విభాతి
సూర్యుడు ప్రకాశించని చోట, చంద్రుడు, నక్షత్రాలు, విద్యుత్ ప్రకాశించని చోట, ఆయన ఉన్నాడు. మరి ఈ చిన్ని జ్యోతి (నా చేతిలో ఉన్న) ఏమి చేయగలదు? ప్రతిదీ అతని వలననే ప్రకాశిస్తాయి. అతని వెలుగు వలన మాత్రమె మనమంతా ప్రకాశింప బడుతున్నాము.
పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణ దేవుడు. తూర్పు దిక్కుకన్నా తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఎత్తుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే సర్వశుభములు కలుగుతాయి. పడమర భాగంలో మంచి నీటి బావులు, బోరులు నిర్మించుకోవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఈ దిశ ఉండాలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
అలాగే దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశ ఖాళీ స్థలం కన్నా ఈ దిశలో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
ఈశాన్య దిక్కకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు... బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
ఆగ్నేయానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు... ఇతర దిశలకన్నా ఎక్కువ పల్లంగా ఉంచటం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటం జరుగుతుంది.
వాయవ్యానికి అధిష్టాన దేవత వాయువు. నైరుతి,ఆగ్నేయ దిశలకన్నా పల్లంగానూ, ఈశాన్య దిక్కుకన్నా మిర్రుగానూ ఉండాలి. అదే విధంగా ఈ దిశలో నూతులు,గోతులు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశ ఈశాన్యం కన్నా హెచ్చుగా పెరిగి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పుత్ర సంతతికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్న దిక్కులకన్నా ఈ దిశ తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ఈ దిశలో ఎక్కువగా బరువులు వేయటం శుభం. ఈ దిశలో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.
-------------------------------
అష్టదిక్పాలకులు
వారి ప్రాధాన్యత
ప్రతి ఇంటికి ఎనిమిది
దిక్కులు ఉంటాయి. ఒక్కో దిగ్గుక్కును ఒక్కో దేవత పరిపాలిస్తుంటారు. ఆ ప్రకారం
తూర్పు దిక్కుకు అధిష్టాన దేవత ఇంద్రుడు. ఈయన సంతానం, ఐశ్వర్యాలను
కలిగిస్తాడు కనుక ఈ భాగంలో ఎక్కువ బరువు పెట్టడం మంచిది కాదు. ఈ దిక్కులో బావులు,
బోర్లు నిర్మించటం వల్ల శుభం చేకూరుతుంది.
పడమర దిక్కునకు అధిష్టాన దేవత వరుణ దేవుడు. తూర్పు దిక్కుకన్నా తక్కువ ఖాళీ స్థలం విడిచిపెట్టి ఎత్తుగా ఉండే విధంగా చూసుకున్నట్లయితే సర్వశుభములు కలుగుతాయి. పడమర భాగంలో మంచి నీటి బావులు, బోరులు నిర్మించుకోవచ్చు. అయితే ఇవి విదిశలకు తగలకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.
ఇక ఉత్తర దిక్కుకు అధిష్టాన దేవత కుబేరుడు. దక్షిణ దిక్కుకంటే పల్లంగానూ విశాలంగానూ ఈ దిశ ఉండాలా చూసుకోవాలి. ఈ దిక్కులో బోరులు, బావులు ఏర్పాటు చేసుకోవటం మంచిదే. దీనివల్ల విద్య, ఆదాయం, సంతానం, పలుకుబడి పెరుగే అవకాశం ఉంది.
అలాగే దక్షిణం దిశకు అధిష్టాన దేవత యముడు. ఉత్తరదిశ ఖాళీ స్థలం కన్నా ఈ దిశలో తక్కువ ఖాళీ స్థలం ఉండేటట్లు చూసుకోవడం ఉత్తమం. దీనివల్ల సంతానం, ఆదాయం అభివృద్ధి చెందుతుంది. దీనికి వ్యతిరేకంగా ఉన్నట్లయితే స్థిరాస్తుల అమ్మకం, అనారోగ్యాలు బారిన పడక తప్పదు.
ఈశాన్య దిక్కకు అధిదేవత ఈశ్వరుడు. అన్ని దిక్కుల కన్నా ఈ దిశ విశాలంగా, పల్లంగానూ ఉండాలి. ఈశ్వరుడు గంగాధరుడు కనుక ఈ దిశలో నీరు... బావి ఉండటం వల్ల అష్టైశ్వర్యములు కలుగుతాయి. అంతేగాక భక్తి జ్ఞానములు ఉన్నత ఉద్యోగాలు సమకూరతాయని వాస్తు శాస్త్రం తెలియజేస్తోంది.
ఆగ్నేయానికి అధిష్టాన దేవత అగ్నిదేవుడు. అందువల్ల ఈ దిక్కున వంట ఏర్పాటు చేసుకోవటం శుభం. బావులు, గోతులు... ఇతర దిశలకన్నా ఎక్కువ పల్లంగా ఉంచటం ఎంత మాత్రం మంచిదికాదు. దీనివల్ల వ్యసనాలు, ప్రమాదాలు, అనారోగ్యాలు స్థిరాస్థులు కోల్పోవటం జరుగుతుంది.
వాయవ్యానికి అధిష్టాన దేవత వాయువు. నైరుతి,ఆగ్నేయ దిశలకన్నా పల్లంగానూ, ఈశాన్య దిక్కుకన్నా మిర్రుగానూ ఉండాలి. అదే విధంగా ఈ దిశలో నూతులు,గోతులు ఉండకుండా చూసుకోవాలి. ఈ దిశ ఈశాన్యం కన్నా హెచ్చుగా పెరిగి ఉండకూడదు. ఇలా ఉండటం వల్ల పుత్ర సంతతికి హాని, అభివృద్ధికి అవరోధం కలిగే అవకాశం ఉంది.
నైరుతి దిక్కుకు అధిష్టాన దేవత నివృత్తి అనే రాక్షసుడు. అన్న దిక్కులకన్నా ఈ దిశ తక్కువ ఖాళీగా ఉండి ఎక్కువ ఎత్తు కలిగి ఉండాలి. ఈ దిశలో ఎక్కువగా బరువులు వేయటం శుభం. ఈ దిశలో గోతులు, నూతులు ఉన్నట్లైతే ప్రమాదాలు, దీర్ఘ వ్యాధులు, స్థిరాస్తులు కోల్పోవటం జరుగుతుంది.
అష్టదిక్పాలకులలో శుభకారకులు ఎవరు?
తూర్పు : క్షత్రియ సంభవుడు. దర్తంకీర్తి కారకుడు, రాజస గుణాధిక్యతగలవాడు ఇంద్రుడు.
పడమర : పాశంతో బంధించి, పురుషులకు
తక్కువ సామర్ధ్యమిచ్చవాడు వరుణుడు.
దక్షిణ :
మృత్యుకారకుడు. వినాశకుడు. దరిద్రకారుడు. సమవర్తి. ధన హీనుడు యముడు.
ఉత్తర : ఐశ్వర్య, భోగ
భాగ్యకారకుడు. సకల సంపత్కరుడు. ధనాధిపతి. కుబేరుడు.
ఈశాన్యం : ఈశాన్య దిక్పతి. మృత్యుంజయుడు, సకల శుభకారకుడు. వంశోద్దీపకుడు. శివుడు.
వాయువ్యం : అస్తిరత్వం ఎక్కువ. చంచలబుద్ధి. స్థాన భ్రష్ఠత్వం కలిగించే
గుణంగలవాడ వాయువు.
నైరుతి : నర వాహనుడు, రాక్షసుడు.
పీడా కారకుడు. రక్తపానమత్తుడు. హింసా కారకుడు. నైరుతి.
ఆగ్నేయం : దురహంకారి, సర్వదగ్ధ
సమర్ధుడు, ధన లేమి కారకుడు, రోగ
కారకుడు కూడా - అగ్ని.
---------------------
గోవులో
దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ
ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం
(ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త
భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
గోవులో వివిధ భాగాల్లో దాగివున్న వివిధ రకాల దేవదేవతుల వివరాలను ఓ సారి పరిశీలిస్తే.. గోవు నుదురు, కొమ్ముల భాగంలో శివుడు కొలువుదీరి ఉంటాడట. అందువల్ల కొమ్ములపై చల్లిన నీటిని సేవిస్తే... త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుందని పురాణాలు చెపుతున్నాయి. అంతేకాకుండా, శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ... బిళ్వ దళాలతో పూజిస్తే... సాక్ష్యాత్ కాశీ విశ్వేశ్వరుడిని పూజించిన ఫలితం దక్కుతుందని వేద పండితులు చెపుతుంటారు.
అలాగే, గోవు నాసిక భాగంలో సుబ్రహ్మణ్యస్వామి ఉండటం వల్ల నాసికను పూజిస్తే... సంతాన నష్టం ఉండదని, ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉంటారని వారు చెపుతారు. అందువల్ల చెవిని పూజిస్తే... సమస్త రోగాల నుంచి విముక్తి కలుగుతుందట. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారనీ, వాటిని పూజించడం వల్ల అజ్ఞానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు నాలికపై వరుణ దేవుడు ఉండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి కలుగుతుందని చెపుతున్నారు.
అదేవిధంగా ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే... విద్యాప్రాప్తి. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలు ఉంటారని ప్రఘాడ విశ్వాసం. కనుక వాటిని పూజిస్తే... యమబాధలుండవని, పుణ్యలోక ప్రాప్తి కలుగుతుందని చెపుతారు. ఆవు పెదవుల్లో ప్రాతఃసంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే... పాపాలు నశిస్తాయని పండితుల అభిప్రాయం. అలాగే, ఆవు కంఠంలో ఇంద్రుడు ఉంటాడని, అందువల్ల దాన్ని పూజిస్తే ఇంద్రియ పాఠవాలు, సంతానం కలుగుతుందట.
ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే... ధర్మార్థ, కామమోక్షాలు కలుగుతాయని చెపుతున్నారు. ఆవు గిట్టల చివర నాగదేవతలు ఉంటారట. వాటిని పూజిస్తే... నాగలోక ప్రాప్తి లభిస్తుందని చెపుతున్నారు. వాటితో పాటు.. భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారు. కనుక గిట్టలను పూజిస్తే... గంధర్వలోక ప్రాప్తి. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారు. ఆ భాగాన్ని పూజిస్తే... సఖ్యత, సౌందర్యం లభిస్తుందట. అందువల్ల గోమాతను సకల దేవతా స్వరూపంగా భావించి పూజిస్తుంటారు.
----------------------------
భక్తి భావంలోని ఐదు సిద్ధాంతాలేంటో మీకు
తెలుసా!?
భక్తిని
పెంపొందించేందుకు, భక్తి మార్గాన్ని అవలంబించేందుకు ఐదు సిద్ధాంతాలు ఉన్నాయి.
1. పరమేశ్వరుడే యావత్ ప్రపంచానికి ప్రభువు, అణువణువునా వ్యాపించినా అనంతుడు ఈశ్వరుడే, మనిషి-పశువు అనే భేదం లేకుండా ఈ చరాచర ప్రపంచమంతా ఆ మహా పవిత్రుడైన ఈశ్వర అద్భుతాలతో నిండి ఉంది.
2. సంపూర్ణుడైన పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులో సుఖము, సౌందర్యమే నిండి ఉంది. ఈ విశ్వాసాన్ని మనస్సు అనుసరించినప్పుడు ప్రపంచం అతి సుందరంగా కనబడుతుంది.
3. భగవంతుడు ఏది అందిస్తే దానితో తృప్తి చెంది భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞులుగా మెలగాలి. కష్టాలు, దుఃఖాలుగా భావించేదేది నిజమైన కష్టాలు కావు. అవన్నీ మన మనస్సుని ఉన్నత స్థాయిలో ఉంచడానికే అనే సత్యాన్ని గ్రహించాలి.
4. మనస్సును బాధపెట్టడంకంటే మించిన పాపం లేదు. ఇతరుల ప్రసన్నతను, సంతోషాన్ని సహించి పంచుకోవడమే పరమధర్మం.
5. నేను, నాది అనే అహం విడచి ఈ సమస్తం భగవంతుడిదే అనే భావాన్ని పరిపూర్ణంగా పొందేందుకు సద్గురువును ఆశ్రయించాలి. తత్ఫలితంగా భగవంతునిలో ఐక్యమయ్యే ఆదర్శ సూత్రాలు అలవడుతాయి.
1. పరమేశ్వరుడే యావత్ ప్రపంచానికి ప్రభువు, అణువణువునా వ్యాపించినా అనంతుడు ఈశ్వరుడే, మనిషి-పశువు అనే భేదం లేకుండా ఈ చరాచర ప్రపంచమంతా ఆ మహా పవిత్రుడైన ఈశ్వర అద్భుతాలతో నిండి ఉంది.
2. సంపూర్ణుడైన పరమేశ్వరుడు సృష్టించిన ఈ జగత్తులో సుఖము, సౌందర్యమే నిండి ఉంది. ఈ విశ్వాసాన్ని మనస్సు అనుసరించినప్పుడు ప్రపంచం అతి సుందరంగా కనబడుతుంది.
3. భగవంతుడు ఏది అందిస్తే దానితో తృప్తి చెంది భగవంతుడికి ఎల్లవేళలా కృతజ్ఞులుగా మెలగాలి. కష్టాలు, దుఃఖాలుగా భావించేదేది నిజమైన కష్టాలు కావు. అవన్నీ మన మనస్సుని ఉన్నత స్థాయిలో ఉంచడానికే అనే సత్యాన్ని గ్రహించాలి.
4. మనస్సును బాధపెట్టడంకంటే మించిన పాపం లేదు. ఇతరుల ప్రసన్నతను, సంతోషాన్ని సహించి పంచుకోవడమే పరమధర్మం.
5. నేను, నాది అనే అహం విడచి ఈ సమస్తం భగవంతుడిదే అనే భావాన్ని పరిపూర్ణంగా పొందేందుకు సద్గురువును ఆశ్రయించాలి. తత్ఫలితంగా భగవంతునిలో ఐక్యమయ్యే ఆదర్శ సూత్రాలు అలవడుతాయి.
కామెంట్లు
కామెంట్ను పోస్ట్ చేయండి